చెన్నై : బాకీ తీర్చేందుకు ఓ వ్యక్తి తన భార్యను ఇద్దరు స్నేహితులతో గడిపేందుకు బలవంతం చేసిన దారుణ ఘటన తమిళనాడులోని కడలూరులో వెలుగుచూసింది. ఎల్ఆర్ పాళ్యంకు చెందిన నిందితుడు 2018లో 21 ఏండ్ల పార్వతి (పేరు మార్పు)ని వివాహం చేసుకున్నాడు. నిందితుడు మధుసూధన్ గత ఏడాది నుంచి కొవిడ్-19 లాక్ డౌన్ కారణంగా ఎలాంటి పనీ చేయడం లేదు. దంపతులకు ఇద్దరు కుమారులు కాగా, ఎలాంటి జీవనోపాధి లేకపోవడంతో మధుసూధన్ తన ఇద్దరు స్నేహితులు సుందరమూర్తి (25), మణికందన్(26)ల వద్ద పలుమార్లు అప్పు చేశాడు.
వీరికి బాకీ డబ్బులు చెల్లించలేని మధుసూధన్ అందుకు బదులుగా తన భార్యపై లైంగిక దాడికి పాల్పడాలని కోరాడు. విటమిన్ ట్యాబ్లెట్ పేరుతో భార్యచే నిద్ర మాత్ర మింగించిన మధుసూధన్ తన స్నేహితుడు సుందరమూర్తిని పిలిపించి లైంగిక దాడికి ప్రేరేపించాడు. భర్త నీచాన్ని గ్రహించిన బాధితురాలు అతడిని తీవ్రంగా మందలించింది.ఇక మరో సందర్భంలో భార్య నిద్రిస్తుండగా స్నేహితుడు మణికందన్ ను పిలిచిన మధుసూధన్ ఆమెపై లైంగిక దాడి చేయాలని కోరాడు. భయంతో నిద్ర నుంచి బాధితురాలు లేవగానే మణికందన్ పారిపోయాడు. బాధిత మహిళ ఫిర్యాదు ఆధారంగా ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.