ముంబై : భార్యను కలిసేందుకు క్వారంటైన్ కేంద్రం నుంచి పారిపోయిన వ్యక్తిని 24 గంటల్లోపే ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్వారంటైన్ సెంటర్ లో వైర్ ను కట్ చేసి నిందితుడు పారిపోయాడు.బాంద్రా, బొరివలి మధ్య పలు షాపుల్లో చోరీలకు పాల్పడిన కేసులో నిందితుడిని ఇటీవల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆపై అతడికి నిర్వహించిన వైద్య పరీక్షలో కొవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
దీంతో నిందితుడు సబాబుల్లా ఖాన్ ను బొరివలిలోని సాయినగర్ ప్రాంతంలోని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. అయితే క్వారంటైన్ కేంద్రం నుంచి తాను రెండ్రోజుల్లో తప్పించుకుంటానని అతడు పోలీసులకు సవాల్ విసిరాడు. అన్నట్టుగానే అక్కడి నుంచి పారిపోవడంతో అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని ముంబైలోని ఒషివర ప్రాంతంలో అరెస్ట్ చేశారు. భార్యను కలుసుకునేందుకే తాను పారిపోయానని నిందితుడు చెప్పుకొచ్చాడు. ఇక ఫార్మసీల నుంచి నిందితుడు రెమ్డిసివిర్ మందులను చోరీ చేశాడనే ఆరోపణలున్నాయి.