ముంబై: కట్నంగా 21 కాలి వేళ్లున్న తాబేలు, బ్లాక్ లాబ్రడార్ను కోరిన వ్యక్తిపై కేసు నమోదైంది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఈ ఘటన జరిగింది. నాసిక్కు చెందిన ఆర్మీ జవాన్కు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఔరంగాబాద్కు చెందిన ఒక మహిళతో నిశ్చితార్థం జరిగింది. ఎంగేజ్మెంట్కు ముందు వధువు కుటుంబం రెండు లక్షల నగదు, పది గ్రాముల బంగారాన్ని కట్నంగా ఇచ్చింది. ఎంగేజ్మెంట్ తర్వాత వధువుకు పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగం పేరుతో వరుడి కుటుంబం మరో పది లక్షలు తీసుకున్నా ఉద్యోగం కల్పించలేదని వధువు కుటుంబం ఆరోపించింది. తాజాగా 21 కాలి వేళ్లున్న తాబేలుతోపాటు బ్లాక్ లాబ్రడార్ను కట్నంగా వరుడి కుటుంబం డిమాండ్ చేసినట్లు తెలిపింది.
అదృష్టం కలిసి వస్తుందని భావించే 21 కాలి వేళ్లున్న అరుదైన తాబేలు ధర మార్కెట్లో ఐదు నుంచి పది లక్షలు ఉంటుందని, దీని కోసం ప్రయత్నించినా ఎక్కడా లభించలేదని వధువు కుటుంబం పేర్కొంది. దీంతో వరుడి కుటుంబం పెండ్లిని రద్దు చేసుకున్నదని ఆరోపించింది. అయితే తాము ఇచ్చిన డబ్బులు, బంగారాన్ని తిరిగి ఇవ్వాలని కొరగా వరుడి కుటుంబం నిరాకరించిందని, దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది. మరోవైపు వధువు తండ్రి ఫిర్యాదుతో వరుడు, అతడి కుటుంబ సభ్యులపై చీటింగ్ తదితర సెక్షన్ల కింద మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సాధనా అవద్ తెలిపారు.