పాల్ఘర్: ఓ మహిళ మద్యం అలవాటు ఆమె ప్రాణం తీసింది. ఆమె భర్తను హంతకుడిని చేసింది. తాగుడుకు బానిసగా మారిందన్న కోపంతో ఓ వ్యక్తి తన భార్యను గొడ్డలితో నరికిచంపాడు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా రన్సేత్ బోయిర్ పాదా గ్రామానికి చెందిన సందీప్ గంగ్యా మోరే (46), వనిత (40) ఇద్దరూ భార్యాభర్తలు. వనిత మద్యానికి బానిసగా మారడంతో భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.
అదే క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం కూడా సందీప్ గంగ్యా మోరే బయటి నుంచి వచ్చేసరికి వనిత ఫుల్గా మద్యం సేవించి ఉంది. అది చూసి సందీప్ ఆగ్రహానికి లోనయ్యారు. తన చేతిలో ఉన్న గొడ్డలితో భార్యపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో వనిత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. నిందితుడిపై కేసు నమోదుచేసి అదుపులోకి తీసుకున్నారు.