భోపాల్: అత్త వారి ఇంటిని వీడి పుట్టింటికి వచ్చిన ఒక యువతిని ఆమె కుటుంబ సభ్యులు దారుణంగా కొట్టారు. బహిరంగంగా జుట్టు పట్టుకుని ఈడ్చి చితకబాది చెట్టుకు కట్టేశారు. మధ్యప్రదేశ్లో జరిగిన ఈ దారుణానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. గిరిజన వర్గానికి చెందిన 19 ఏండ్ల యువతికి మూడు నెలల కిందట పెండ్లి అయ్యింది. అయితే జూన్ 28న అత్త వారి ఇంటిని వీడిన ఆమె అలీరాజ్పూర్లోని తన పుట్టింటికి వచ్చింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె తండ్రి, కుటుంబ సభ్యులు ఆ యువతి జుట్టు పట్టుకుని ఇంటి నుంచి బయటకు ఈడ్చుకొచ్చారు. అందరూ చూస్తుండగా కర్రలతో దారుణంగా కొట్టారు. మళ్లీ ఇక్కడకు తిరిగి వస్తావా అని ప్రశ్నిస్తూ చితక బాదారు. అనంతరం ఆమెను చెట్టుకు కట్టేశారు.
కాగా, ఈ ఘటనను కొందరు తమ సెల్ఫోన్లో చిత్రీకరించారు. ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యాయి. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో బాధితురాలి నుంచి స్టేట్మెంట్ తీసుకుని ఆమె తండ్రి, కుటుంబానికి చెందిన మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు.