రేయింబవళ్లు కష్టాలను ఓర్చి.. స్వచ్ఛతా వెలుగులు పంచుతున్నారు.. ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారికి వెరువక.. ఓపిక, ధైర్యంతో ఎదురొడ్డుతున్నారు. పనే పరమావధిగా విధులు నిర్వహిస్తూ.. విపత్తు సమయంలోనూ.. వృత్తే దైవంగా.. నిరుపమాన సేవలందిస్తున్నారు. శ్రమే ఆయుధమై.. వీధుల్లో యోధుల్లా..కంటికి కనిపించని శత్రువుతో పోరాడుతున్నారు. కోటికిపైగా జనాభా నివసించే గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని ప్రతి రోజూ పరిశుభ్రంగా ఉంచడమంటే మాములు విషయం కాదు. వైరస్ విలయతాండవం చేస్తున్న వేశ.. పారిశుధ్య నిర్వహణ అనేది అత్యంత క్లిష్టం.. ఇలాంటి కీలక తరుణంలో సఫాయి కార్మికుల వృత్తితత్వాన్ని నిండు మనసుతో అభినందించాల్సిందే. వారి సేవా నిరతికి హారతి పట్టాల్సిందే.. చేతులెత్తిమొక్కాల్సిందే.
రాష్ట్ర ఆవిర్భవానికి ముందు పారిశుధ్య కార్మికుల జీతాలు జీహెచ్ఎంసీ పరిధిలో రూ.8,500. కేసీఆర్ సీఎం అయ్యాక 2015లో రూ.12,500 చేశారు. వాళ్లకు ఎంత చేసినా తక్కువే అంటూ 2017లో రూ.14,500 పెంచారు. ముచ్చటగా మూడోసారి దీపావళి కానుకగా గతేడాది నుంచి రూ.17,500 చెల్లిస్తున్నారు.
నగరం నిద్రపోతున్న వేళ జీహెచ్ఎంసీ సఫాయి కార్మికులు విధులకు హాజరై రోడ్లను ఊడ్చేస్తుంటారు. ఉదయం నగర రోడ్లు చూడగానే అద్దంలా మెరుస్తుంటాయి. ఈ మెరుపు వెనుక 19, 548 మందికి పైగా కార్మికులు, పర్యవేక్షకుల శ్రమ దాగి ఉన్నది. వాస్తవంగా వైద్యశాలల వద్ద, కంటైన్మెంట్ ప్రాంతాల్లో అడుగుపెట్టాలంటే.. ప్రజలు భయపడతారు. అలాంటి చోట్ల సైతం కార్మికులు ధైర్యంగా విధులు నిర్వర్తిస్తున్నారు. కరోనాతో తమకు ఎలాంటి భయం లేదని ..ప్రజల ఆరోగ్యం కోసం డ్యూటీ చేస్తున్నందుకు గర్వంగా ఉందని చెబుతున్నారు. కొందరైతే కొన్ని రోజులు కుటుంబసభ్యులకు దూరంగా ఉండి.. మరీ విధులకు హాజరవుతున్నారు. మరికొందరు ఇంటిసభ్యులు వారించినా..ధైర్యంగా బయటకు వచ్చి సామాజిక బాధ్యతగా పనులు చేస్తున్నారు.
ఆపత్కాలంలో పోరాడుతున్న వారికి అవసరమైన వ్యక్తిగత రక్షణ ఉపకరణాలు (పీపీఈ), ముఖానికి మాస్కుల నుంచి వ్యక్తిగత పరిశుభ్రతకు అవసరమయ్యే సబ్బుల వరకు మొత్తం 10 రకాల ఐటమ్స్తో కూడిన ప్రత్యేక కిట్లను సర్కారు అందిస్తున్నది. సోడియం హైపోక్లోరైట్ పిచికారీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎంటమాలజీ విభాగం సిబ్బందికి, వెటర్నరీ విభాగం సిబ్బందికి సేఫ్టీకిట్లను అందిస్తుండగా, అన్ని విభాగాలకు 24వేల మందికి పైగా సిబ్బంది కోసం కొవిడ్ రక్షణ సామగ్రికి రూ. 12 కోట్లు ఖర్చు చేస్తున్నారు.
పదిహేనేళ్లుగా పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్న. చెత్త ఎత్తడం, కాల్వలు శుభ్రం చేయడమే కాదు, ఎవరైనా చనిపోతే అంత్యక్రియలను దగ్గరుండి జరుపుతా. కరోనా వస్తుందని భయమున్నా దేవుడి దయ వల్ల బాగానే ఉన్నా. చావైనా బతుకైనా ప్రజల కోసమే పనులు చేస్తున్నా. -లక్ష్మయ్య, కామాటి, నార్సింగి మున్సిపాలిటీ
పని చేసే సమయంలో కష్టం అనిపించినా.. మా శక్తి మేరకు సేవ చేస్తున్నాం. పనికి వెళ్లకపోతే ఏమవుతుందని ఇంట్లో ఒత్తిడి కూడా పెరిగింది. అయితే నిబంధనలు పాటిస్తూ పనులు చేసుకుంటున్నాం. భయపడాల్సిన అవసరం లేదని కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పినా. సమయానికి జీతం అందుతుండటంతో కుటుంబపోషణకు ఇబ్బందులు కలుగడం లేదు. – జె.శంకరమ్మ, పాతబస్తీ
కరోనా కష్టకాలంలో ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత మాదే. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పనిచేయడం తప్పదు. ఉదయం చెత్తను ఊడ్చితేనే కాలనీలు, బస్తీలు అద్దంలా మారుతాయి. ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. కరోనాతో ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి. అయినా మేము భయపడటం లేదు. బాధ్యతతో విధులు నిర్వర్తిస్తున్నాం. కుటుంబసభ్యుల సహకారం ఉంది. – కంఠం పోచయ్య, పారిశుధ్య కార్మికుడు, కొత్తపేట
వృత్తే దైవంగా భావించి.. అన్ని వేళ్లలో పనిచేసేందుకు సిద్ధంగా ఉంటాం. కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు మా వంతు కృషి చేస్తున్నాం. మహమ్మారి వ్యాప్తి ఉన్నా.. ఏడాది కాలంగా వైరస్కు భయపడకుండా పని చేస్తూనే ఉన్నాం. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. విధులకు హాజరవుతున్నాం. వ్యర్థాలు తొలగించి.. రహదారులను శుభ్రంగా మారుస్తున్నాం. అంకితభావంతో పని చేస్తున్నాం. -పుష్పమ్మ, పారిశుధ్య కార్మికురాలు, చాదర్ఘాట్
17 ఏండ్ల నుంచి స్వీపర్గా పనిచేస్తున్నాను. అప్పట్లో నాకు నెలకు రూ. 1100 జీతం వచ్చేది. ఇప్పుడు నెలకు రూ. 17,500 జీతం లభిస్తున్నది. తెల్లవారే సరికి రోడ్లను శుభ్రంగా ఉంచేందుకు శ్రమిస్తున్న మమ్మల్ని సీఎం కేసీఆర్ సార్ దేవుళ్లు అంటూ.. కీర్తించారు. చిన్న ఉద్యోగులమైన మాకు ఎంతో గౌరవం ఇచ్చారు. స్వీపర్లకు గౌరవం ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ సారే. – బి.యాదలక్ష్మి , పద్మారావునగర్
ఏడాది కాలంగా కరోనా కట్టడికి శ్రమిస్తున్నాం. వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్నా.. భయపడకుండా రోజూ వ్యర్థాలను తొలగిస్తున్నాం. ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదు. రోడ్డుపై చెత్త వేయద్దని చెబుతున్నా.. కొందరు మారడం లేదు. ఇష్టం వచ్చినట్లు వ్యర్థాలను పారబోస్తున్నారు. ప్రజలు సహకరిస్తేనే కదా బస్తీలు శుభ్రంగా ఉండి రోగాలు రాకుండా ఉండేది. -మల్లేశ్, చిక్కడపల్లి
విపత్కర పరిస్థితుల్లో వారియర్లుగా పనిచేస్తున్నందుకు గర్వంగా ఉంది. ప్రభుత్వం మా సేవలను గుర్తించింది. ఫ్రంట్లైన్ వారియర్లుగా ప్రకటించడం సంతోషంగా ఉంది. -శ్రీనివాస్, పారిశుధ్య కార్మికుడు, ఫతేనగర్
కరోనాతో అందరూ భయపడుతున్నా.. ప్రజారోగ్యం కోసం శ్రమిస్తున్నాం. కొవిడ్ నుంచి రక్షణకు అధికారులు తగిన జాగ్రత్తలు చెబుతున్నారు. శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేస్తున్నారు. ఉదయం ఐదు గంటలకే విధులకు వచ్చి.. రహదారులు ఊడ్చుతున్నాం. ప్రజలు సైతం ఎక్కడపడితే అక్కడ వ్యర్థాలు వేయకుండా సహకరించాలి. -జంగమ్మ పారిశుధ్య కార్మికురాలు
వీధి విధినా తిరిగి చెత్తను ఎత్తి, పరిసరాలను శుభ్రం చేస్తేనే ఆ రోజు మాకు సంతోషం అనిపిస్తుంది. కరోనా వ్యాప్తితో ఎవరూ బయటకు వస్తలేరు. కానీ చెత్త మాత్రం విపరీతంగా పెరుగుతున్నది. మా కష్టాలను గుర్తించిన తెలంగాణ సర్కారు ప్రతినెలా ఏడు రోజుల ముందే జీతాలు ఇస్తున్నది. మా ఆరోగ్యాల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నది. -రాజు, నార్సింగి మున్సిపాలిటీ
సీఎం కేసీఆర్ సార్.. మాకు జీతాలు పెంచిన తర్వాత మా జీవితాలు సంతోషంగా ఉన్నాయి. ఏడాది కాలంగా కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా మరింత బాధ్యత పెరిగింది. మా శ్రమను గుర్తించిన సర్కారు మా కోసం కిట్లు అందించింది. పారిశుధ్య నిర్వహణలో భాగంగా మాకు మేం జాగ్రత్తలు తీసుకుంటూనే బాధ్యతలు నిర్వర్తిస్తున్నాం. – సలీమా, పారిశుధ్య కార్మికురాలు, బాలానగర్
లాక్డౌన్ తర్వాత ఆటోలు ఆగిపోవడంతో పనులకు రావాలంటే ఇబ్బందిగా ఉండేది. అధికారులు మేముండే చోటకు ఆర్టీసీ బస్సును పంపించి ఉచితంగా తీసుకొస్తున్నారు. పని పూర్తయిన తర్వాత మళ్లీ బస్సులో ఉచితంగానే ఇంటిని తీసుకెళ్లడం సంతోషంగా ఉంది. కరోనా భయంతో అందరం మాస్కులు పెట్టుకుంటున్నాం. భౌతికదూరం పాటిస్తున్నాం. – సుశీల, పారిశుధ్య కార్మికురాలు, కేపీహెచ్బీ కాలనీ
ఉదయం విధుల్లో చేరగానే కంటికి కనిపించని శత్రువుతో పోరాటం చేస్తున్నాం. ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబసభ్యులకు దూరంగా ఉండాల్సి వస్తున్నది. ఇంటికి వెళ్లగానే నన్ను చూసి నా రెండేండ్ల చిన్నారి తల్లడిల్లడం తలుచుకుంటే కన్నీరు వస్తుంటుంది. వీటికితోడు ఎన్నో నెలలుగా విరామంలేని విధులు. చాలా కష్టంగానే అనిపిస్తున్నా.. వైరస్కట్టడిలో నా సేవలు అవశ్యంగా మారడంతో ఇష్టంగానే భరిస్తున్నాను. -నాగరాజు, యస్ఎఫ్ఏ, హఫీజ్పేట్
కరోనా కష్టకాలంలో మా అధికారులు అన్ని జాగ్రత్తలు చెబుతున్నారు. ధైర్యం ఇస్తున్నారు. చేతులు శానిటైజ్ చేసుకున్నాకే రహదారులపై వస్తువులను ముడుతున్నాం. ప్రజలు సైతం మాకు ఎంతగానో సహకరిస్తున్నారు. – యాదమ్మ, పారిశుధ్య కార్మికురాలు, మల్కాజిగిరి