బంజారాహిల్స్ : ఆన్లైన్లో లాటరీ వచ్చిందని నమ్మించి బ్యాంకు ఖాతానుంచి డబ్బులు కాజేసిన ఘటన బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొమురం భీమ్ జిల్లా సిర్పూర్కు చెందిన దుర్గం కల్యాణి బంజారాహిల్స్లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఈ నెల 21న కల్యాణికి గుర్తు తెలియని వ్యక్తినుంచి ఫోన్ కాల్ వచ్చింది.
ఆన్లైన్లో రెగ్యులర్గా షాపింగ్ చేస్తున్నందున లక్కీ డ్రాలో లాటరీ వచ్చిందని, రిజిస్ట్రేషన్తో పాటు జీఎస్టీ, టీడీఎస్ కింద రూ 14,999 చెల్లించాలని నమ్మించాడు. దాంతో ఈ మొత్తాన్ని ఫోన్ పే ద్వారా చెల్లించింది. మరికాసేపటికి డబ్బులు రాలేదంటూ ఒత్తిడి చేస్తూ మరో రూ.14,999 వేయాలని చెప్పడంతో మళ్లీ డబ్బును వేసింది. డబ్బులు వేయించు కున్న తర్వాత ఫోన్ స్విచ్చాఫ్ చేశారు. ఈ మేరకు బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.