న్యూఢిల్లీ : కేంద్ర కేబినెట్ విస్తరణకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం కొత్తగా సహకార మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసింది. దేశంలో సహకార ఉద్యమాన్ని బలోపేతం చేయడం ఈ శాఖ లక్ష్యమని కేంద్ర సెక్రటేరియట్ వర్గాలు తెలిపాయి. ‘సహకార్ సే సమృద్ధి’ (సహకారంతో సమృద్ధి) విజన్ను సాధించేందుకు ఈ శాఖను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దేశంలో సహకార ఉద్యమానికి బలం చేకూర్చేందుకు న్యాయ, విధాన, పాలనాపరమైన కార్యాచరణను ఈ మంత్రిత్వ శాఖ రూపొందిస్తుందని పేర్కొన్నారు. ఈ కొత్త శాఖకు సంబంధించి కొత్త మంత్రిని బుధవారం జరిగే మంత్రివర్గ విస్తరణలో నియమించే అవకాశం ఉన్నది.
ప్రజా ఉద్యమం క్షేత్రస్థాయికి చేరుకునేందుకు నూతన మంత్రిత్వ శాఖ ఉపయోగపడుతుందని, బాధ్యతాయుతంగా పనిచేసే వ్యక్తులు ఉన్న ఈ దేశానికి.. సహకార ఆధారిత ఆర్థిక అభివృద్ధి విధానం సరిగ్గా సరిపోతుందని అధికారులు పేర్కొన్నారు. సహకార సంస్థల సులభతర వాణిజ్యం కోసం ఈ మంత్రిత్వ శాఖ పని చేయడంతో పాటు బహుళ స్థాయి సహకార సంస్థల అభివృద్ధిని సాకారం చేసేందుకు ఈ శాఖ పాటుపడుతుందని వివరించారు. సమాజ ఆధారిత అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వం విశ్వసిస్తుందని.. కొత్త మంత్రిత్వ శాఖ ఆ దిశగా ముందడుగుగా సంబంధిత అధికారులు అభివర్ణించారు. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి చేసిన ప్రకటన వాస్తవరూపు దాల్చినట్లు అవుతుందని పేర్కొన్నారు.