కారును తప్పించబోయి లారీ బోల్తా
ఒడిశాకు చెందిన ఆరుగురు కార్మికుల దుర్మరణం
శంషాబాద్ రూరల్, ఏప్రిల్ 18: శంషాబాద్లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా అతివేగంగా వస్తున్న కారును తప్పించబోయి ఓ లారీ బోల్తాపడింది. ప్రమాదంలో లారీలోని ముగ్గురు ఒడిశాకు చెందిన కార్మికులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు దవాఖానలో చికిత్స పొందుతూ చనిపోయారు. మృతులను కృపాసున (40), గోపాల్దీప్ (45), కళాకుమార్ (25), సహదర్ (40), హస్తా (45), పరమానంద్ (52)గా గుర్తించారు. లారీలో ఉన్న దాదాపు 20 మంది గాయపడ్డారని శంషాబాద్ రూరల్ సీఐ ప్రకాశ్రెడ్డి తెలిపారు. శంషాబాద్ మండలంలోని సుల్తాన్పల్లిలో ఒడిశాకు చెందిన పలువురు ఇటుకబట్టీ కార్మికులుగా పనిచేస్తున్నారు. వీరు ప్రతి ఆదివారం కూరగాయలు, నిత్యావసర వస్తువులు కొనేందుకు లారీలో శంషాబాద్కు వెళ్తారు. ఎప్పటిలాగే 30 మందికిపైగా కార్మికులు సరుకులు తీసుకుని శంషాబాద్ నుంచి లారీలో సుల్తాన్పల్లికి తిరిగి బయలుదేరారు. మజీద్గూడ వద్దకు రాగానే నర్కుడ వైపు నుంచి ఎదురుగా అతివేగంగా కారు దూసుకొచ్చింది. కారు కొద్దిగా తగులగానే దాన్ని తప్పించే ప్రయత్నంలో లారీ బోల్తాపడింది. లారీ కింద చిక్కుకుని ముగ్గురు మృత్యువాతపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం దవాఖానకు తరలించారు. కారులోని ముగ్గురు మద్యం తాగి అతివేగంగా నడిపినట్టు స్థానికులు చెప్తున్నారు. ఈ ప్రమాదంపై ఎంపీ రంజిత్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.