లక్నో: ఉత్తరప్రదేశ్లోని జిల్లా కోర్టులో ఒక న్యాయవాదిపై కాల్పులు జరిపి హత్య చేశారు. షాజహాన్పూర్ జిల్లా కోర్టులో సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది. న్యాయవాది భూపేంద్ర సింగ్ కోర్టు కాంప్లెక్స్లోని మూడో అంతస్తులో ఎవరితోనో మాట్లాడుతున్నారు. ఇంతలో తుపాకీ కాల్పుల శబ్దం వినిపించింది. అనంతరం ఆ న్యాయవాది కిందపడి రక్తం మడుగుల్లో చనిపోయి ఉన్నాడు. మృతదేహం సమీపంలో నాటు తుపాకీని గుర్తించారు.
న్యాయవాది భూపేంద్ర సింగ్ను మరో న్యాయవాది హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరి మధ్య పాత గొడవ దీనికి కారణమని చెప్పారు. ఫోరెన్సిక్ బృందం సంఘటనా స్థలానికి చేరి ఆధారాలు సేకరించిందని, నిందితుడైన మరో న్యాయవాదిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, భూపేంద్ర సింగ్ గతంలో బ్యాంకులో పని చేశారని, గత నాలుగైదు ఏండ్ల నుంచి న్యాయవాద వృత్తిలో ఉన్నారని తోటి న్యాయవాది ఒకరు తెలిపారు.