ముంబై: కష్టకాలంలో నిత్యం ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న నర్సుల కృషి అమూల్యమైనదని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేర్కొన్నాడు. బుధవారం అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా మాస్టర్ బ్లాస్టర్ ట్వీట్ చేశాడు. కరోనా మహమ్మారి సమయంలో నర్సులు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారని కీర్తించాడు. మౌనంగా మానవత్వాన్ని నిత్యం పంచుతున్నారు. మాకు ఆరోగ్యం సరిగా లేని సమయాల్లో నిద్రలేకుండా.. విరామం లేకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. కరోనా మహమ్మారి సమయంలో మీ సేవల విలువెంతో అందరికీ మరింత ఎక్కువగా అర్థమైంది. మీరు చేస్తున్న సేవలకు కృతజ్ఞతలు అని సచిన్ ట్వీట్ చేశాడు. దీంతో పాటు తనకు కరోనా సోకిన సమయంలో వైద్య సేవలు అందించిన నర్సుల ఫొటోను జతచేశాడు.