కొత్తూరు రూరల్ : ప్రమాదవశాత్తు పరిశ్రమ ఆవరణలో గల నీటి సంపులో పడి రెండేండ్ల బాలుడు మృతి చెందిన సంఘటన కొత్తూరు మండల కేంద్రంలో శనివారం చోటు చేసుకుంది. సీఐ భూపాల్శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ఫతేపూర్ జిల్లాకు చెందిన భూపేంద్రకుమార్ తన భార్య రింకిదేవి కుమారుడు రామ్(2) కొన్నేండ్ల క్రితం జీవనోపాధికోసం కొత్తూరుకు వలస వచ్చారు. మండల కేంద్రంలోని కొత్తూరుతండా సమీపంలో గల శ్రీసాయి రాఘవ పాలిమర్స్ పరిశ్రమలో కార్మికుడిగా చేరి విధులు నిర్వహిస్తూ, పరిశ్రమ ఆవరణలో గల క్వార్టర్స్లో నివాసముంటూ జీవనం సాగిస్తున్నారు.
ఈ క్రమంలో శనివారం తండ్రి తోటి కార్మికుడితో మాట్లాడుతూ ఉండగా పరిశ్రమకు చెందిన నీటి సంపు సమీపంలో రామ్ ఆడుకుంటు ఉన్నాడు. ఆడుకుంటున్న రామ్ కొద్ది సేపటి తర్వాత కనిపించకపోవటంతో పరిశ్రమ ఆవరణలో వెతికరు. రామ్ ఎంతకి కనిపించకపోవటంతో అనుమానం వచ్చి నీటి సంపులో చూసేసరికి నీటిలో తేలుతూ కనిపించటంతో వెంటనే బయటకి తీసి హుటాహుటిన కొత్తూరులోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందాడని వైద్యులు నిర్థారించటంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.