తిరువనంతపురం: కారులో ఫుడ్ తింటున్నందుకు తల్లీ, కుమారులపై ఒక వ్యక్తి దాడి చేశాడు. కేరళలోని కొల్లం జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఆగస్ట్ 30న పరవూర్ బీచ్ సమీపంలో రద్దీగా ఉన్న రోడ్డు పక్కన నిలిపిన కారులో 44 ఏండ్ల మహిళ, 23 ఏండ్ల కుమారుడు భోజనం చేస్తున్నారు. గమనించిన ఆశిష్ అనే వ్యక్తి వారి వద్దకు వచ్చి దీనిపై నిలదీసి తిట్టాడు. అనంతరం కారుపై దాడి చేశాడు. కుమారుడు వచ్చి అడ్డుకోబోగా అతడ్ని కొట్టాడు. కల్పించుకున్న తల్లి పైనా ఆశిష్ దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి అతడు పారిపోయాడు.
ఈ దాడిలో తల్లీ, కుమారులకు పలు చోట్ల గాయాలు కాగా, కారు కూడా స్వల్పంగా ధ్వంసమైంది. దీంతో ఆ మహిళ, ఆమె కుమారుడు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోరల్ పోలీసింగ్ కింద కేసు నమోదు చేశారు. తమిళనాడుకు పారిపోతున్న నిందితుడు ఆశిష్ను ఈ నెల 1 రాత్రి వేళ పోలీసులు అరెస్ట్ చేశారు.