షిరిడీకి వెళ్దామని చెప్పి.. స్వామీజీ కిడ్నాప్

హైదరాబాద్: కర్ణాటకకు చెందిన అమ్మాజీ అనే స్వామిజీ కిడ్నాప్కు గురయ్యారు. బార్లీ జిల్లాలోని కపిలాపూర్లో స్వామీజీని దుండగులు కిడ్నాప్ చేశారు. భాస్కర్ రెడ్డి, సతీష్ అనే ఇద్దరు కిడ్నాపర్లు విమానంలో షిరిడీ తీసుకెళ్తామని స్వామిజీ నమ్మించారు. అనంతరం ఓ కారులో హైదరాబాద్కు తీసుకువచ్చారు. ఆపై హైదరాబాద్ నుంచి శంషాబాద్ మీదుగా బెంగుళూరుకు తీసుకెళ్లారు. స్వామీజీని ఓ గదిలో బంధించిన కిడ్నాపర్లు నాలుగురోజులపాటు చిత్రహింసలకు గురిచేశారు. అయితే.. రూ.20 కోట్ల నగదు, కిలో బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరకు రూ.5 కోట్లు ఇస్తానని స్వామీజీ ఒప్పుకోవడంతో తిరిగి హైదరాబాద్కు తీసుకువచ్చారు. కాగా హైదరాబాద్కు చేరుకోగానే గుండె నొప్పి వస్తుందని, తనను వెంటనే ఆస్పత్రిలో చేర్పించాలని స్వామీజీ కోరారు. ఎట్టకేలకు కిడ్నాపర్ల గురించి వైద్యుని ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. కిడ్నాపర్లను పట్టుకొని లంగర్హౌజ్ పోలీసులకు అప్పగించారు. అయితే కిడ్నాపర్లు కేసు నమోదు చేయకుండా లంగర్హౌజ్ సీఐ వారిని వదిలిపెట్టారని స్వామీజీ ఆరోపించారు. కాగా, స్వామీజీ ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాలేదని సీఐ చెప్పారు. కిడ్నాపర్లు తన భక్తులేనని, వారిని వదిలేయాలని స్వామీజీ కోరినట్లు వెల్లడించారు.