బెంగళూరు: మరో మతం యువతితో కలిసి బస్సులో ప్రయాణిస్తున్న యువకుడ్ని కొందరు దారుణంగా కొట్టి కత్తితో పొడిచారు. తీవ్రంగా గాయపడిన అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ వ్యక్తిపై దాడి చేసిన వారిని బజరంగ్ దళ్కు చెందిన వారిగా గుర్తించిన పోలీసులు కొందరిని అరెస్ట్ చేశారు. మరో నలుగురి కోసం గాలిస్తున్నారు. కర్ణాటకలోని మంగళూరులో గురువారం ఈ ఘటన జరిగింది. వేర్వేరు మతాలకు చెందిన యువతీ, యువకుడు క్లాస్మేట్స్ మరియు స్నేహితులు. గురువారం వారిద్దరు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంగళూరు నుంచి బెంగళూరు వెళ్తున్నారు. బెంగళూరు గురించి తెలిసిన ఆ వ్యక్తి సహాయంగా ఆమె వెంట వెళ్తున్నాడు.
కాగా, కారులో వచ్చిన కొందరు మంగళూరు శివారులో ఆ బస్సును అడ్డగించారు. ఆ యువతీ యువకుడ్ని బలవంతంగా బస్సు నుంచి కిందకు దించారు. ఆ యువకుడ్ని దారుణంగా కొట్టారు. తుంటిపై కత్తితో పొడిచారు. అడ్డుకోబోయిన యువతిపైనా చేయి చేసుకున్నారు. తీవ్రంగా గాయపడిన ఆ యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి నిలకడగానే ఉన్నదని వైద్యులు తెలిపారు.
బజరంగ్ దళ్కు చెందిన వ్యక్తులపై హత్యాయత్నం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కొందరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మరో నలుగురిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వేర్వేరు మతాలకు చెందిన ఆ యువతీ, యువకుడు కలిసి ప్రయాణిస్తున్నట్లు బజరంగ్ దళ్కు చెందిన వారికి ఎవరు సమాచారం ఇచ్చారు అన్నదానిపైనా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.