కొత్తగూడెం : ఛత్తీస్గఢ్ ఏజెన్సీలో మావోయిస్టులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. భద్రతా బలగాలను టార్గెట్ చేస్తూ అమర్చిన మందుపాతర పేలి ఓ జవాన్ దుర్మరణం చెందాడు. ఇందుకు సంబంధించిన వివరాలను దంతేవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ్ వెల్లడించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతేవాడ జిల్లా బర్సూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాహుర్నార్ సమీపంలో ఇంద్రావతి నది నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ పనుల వద్ద 22వ బెటాలియన్కు చెందిన జవాన్ లక్ష్మీకాంత్ ద్వివేది సెక్యూరిటీ విధులు నిర్వర్తిస్తున్నాడు.
మధ్యాహ్నం సుమారు 2గంటల సమయంలో లక్ష్మీకాంత్ సమీపంలోని ఓ చెట్టు కింద భోజనం చేసేందుకు వెళ్లాడు. అక్కడ జవాన్ భోజనానికి కూర్చునేందుకు ప్రయత్నించగా ఆ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన ఇంప్రోవైజ్డ్ ఎక్స్ప్లోజీవ్ డివైస్ (ఐఈడీ) భారీ విస్పోటనం చెంది అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ దుర్ఘటనలో జవాన్ లక్ష్మీకాంత్ మృతదేహం తునాతునకలై మాంసపు ముద్దలుగా పడిపోయింది. సమాచారం తెలుసుకున్న తోటి జవాన్లు వెంటనే అప్రమత్తమై ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని గాలింపులు చేపట్టారు. ఘటనలో మృతిచెందిన జవాన్ లక్ష్మీకాంత్ మృతదేహాన్ని జిల్లా కేంద్రానికి తరలించారు. ఈ ఘటనతో దంతేవాడ పోలీస్ యంత్రాంగం అప్రమత్తమయ్యింది. జవాన్ మృతికి పోలీస్ ఉన్నతాధికారులు సంతాపం ప్రకటించారు.