హైదరాబాద్ : కరోనా వైరస్.. బుసలు కొడుతున్న నాగుపాములా కోరలు చాచి.. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరినీ బలి తీసుకుంటోంది. అంతే కాదు.. ఈ వైరస్ బంధాలను, బంధుత్వాలను దూరం చేస్తోంది. కరోనా సోకిన వ్యక్తి ప్రాణాలను కాపాడుకుందాం అంటే కూడా ఆ వైరస్ ఛాన్స్ ఇవ్వట్లేదు. కరోనా రోగుల వద్దకు వెళ్లిన వారిని సైతం ఆ వైరస్ పట్టిపీడిస్తోంది. చివరకు ఎలా అయిందంటే.. రక్తం పంచుకుపుట్టిన వారిని, పేగు తెంచుకుని పుట్టినవారిని కూడా దూరం చేసే పరిస్థితి ఏర్పడింది. ఓ వ్యక్తి అనారోగ్యానికి గురైతే ఆయన భార్యాపిల్లలు దగ్గరుండి అన్నీ చూసుకుంటారు. కానీ ఈ వైరస్ సోకిన వారి దగ్గరకు వెళ్లాలంటేనే సొంత ఇంటి మనుషులు కూడా భయపడుతున్నారు.
కరోనా సోకి శ్వాస ఆడక, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఓ తండ్రికి బిడ్డ సాహసం చేసి నీళ్లు ఇచ్చేందుకు వెళ్తుండగా, వద్దమ్మా అంటూ తల్లి ఆపింది. అయినా తండ్రి మీదున్న ప్రేమతో ఆయన దగ్గరకు వెళ్లిన బిడ్డ గుక్కెడు నీళ్లు గొంతులో పోసింది. కాసేపటికే తండ్రి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ 50 ఏండ్ల వ్యక్తి.. విజయవాడలో పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఆయన కుటుంబం సొంత జిల్లాలోనే నివాసం ఉంటుంది. అయితే ఆ వ్యక్తికి ఇటీవలే కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో సొంతూరికి చేరుకున్నాడు. దీంతో అతన్ని గ్రామంలోకి రానివ్వలేదు.
ఊరి బయట ఉన్న ఓ గుడిసెలో ఉండాలని గ్రామస్తులు ఆదేశించారు. అతను అక్కడే తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు. ఆయన భార్య, కుమార్తె, కుమారుడికి కూడా కరోనా సోకింది. మొత్తానికి ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితి విషమించింది. చివరకు శ్వాస ఆడక కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. తండ్రిని బతికించుకునేందుకు ఆయన బిడ్డ పడిన ఆరాటం కన్నీరు తెప్పిస్తుంది. తండ్రిని ఎలాగైనా బతికించుకోవాలనే ఉద్దేశంతో ఆయన నోట్లో నీళ్లు పోసింది. ఆ తర్వాత క్షణాల్లోనే ఆయన ప్రాణాలు విడిచాడు. బిడ్డ తండ్రికి నీళ్లు తాగించేందుకు వెళ్తుండగా భయంతో తల్లి వద్దని వారించింది. అయినప్పటికీ ఆ బిడ్డ చేసిన ప్రయత్నం ఫలించలేదు. దీంతో ఆ బిడ్డ రోదన ప్రతి ఒక్కరి హృదయాల్ని కలిచివేసింది.