ధర్పల్లి/సిరికొండ, మే 6: ధర్పల్లి మండలంలో ఇటీవల కురిసిన వర్షానికి తడిసిన ధాన్యాన్ని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ గురువారం పరిశీలించారు. వాడి, హోన్నాజిపేట్, నడిమితండాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఆయన రైతులకు, అధికారులకు పలు సూచనలు చేశారు. ధాన్యం తడిసిందని రైతులు ఆందోళన చెందవద్దని, ప్రతి ధాన్యం గింజనూ ప్రభు త్వం కొనుగోలు చేస్తుందని చెప్పారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే ఆరబెట్టాలని సూచించారు. ఆరబెట్టిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ జయంత్రెడ్డి, ఏవో ప్రవీణ్ తదితరులు ఉన్నారు. సిరికొండ మండలంలోని కొండూర్, సిరికొండ గ్రామాల్లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్ తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే రైస్మిల్లులకు తరలించే ఏర్పాటు చేస్తామని చెప్పారు. తహసీల్దార్ అనిల్కుమార్, విండో చైర్మన్ గంగారెడ్డి, ఎంపీపీ మలావత్ సంగీతారాజేందర్, సర్పంచ్ రాజిరెడ్డి ఉన్నారు.