అహ్మదాబాద్: ఒక ఇన్వెస్టిగేటివ్ పోలీస్ తన ప్రేయసిని హత్య చేశాడు. తన తెలివితేటలు ఉపయోగించి ఆధారాలను మాయం చేసినప్పటికీ దొరికిపోయి అరెస్ట్ అయ్యాడు. గుజరాత్లోని వడోదరలో ఈ ఘటన జరిగింది. అజయ్ దేశాయ్ అనే వ్యక్తి వడోదర గ్రామీణ పోలీస్ స్టేషన్లో ప్రత్యేక ఆపరేషన్ గ్రూప్లో పనిచేస్తున్నాడు. జూన్ 4న కర్జన్లోని ప్రయోషా సొసైటీలోని తన ఇంట్లో ప్రియురాలు స్వీటీ పటేల్తో వాదన జరిగింది. ఈ నేపథ్యంలో అజయ్ దేశాయ్ ఆగ్రహంతో ఆమె గొంతునొక్కి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి కారులో స్నేహితులున్న హోటల్కు వెళ్లాడు. స్నేహితుడు జడేజా సహాయంతో హోటల్ పక్కన ఉన్న అతడి స్థలంలో దిగువన స్వీటీ పటేల్ మృతదేహాన్ని తగులబెట్టాడు. దర్యాప్తు పోలీస్గా తన తెలివితేటలు ఉపయోగించి ఈ హత్యకు సంబంధించిన ఆధారాలు లభించకుండా జాగ్రత్తపడ్డాడు.
మరోవైపు స్వీటీ పటేల్ కనిపించకపోవడంతో ఆమె సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపిన పోలీసులు హత్య జరిగిన అజయ్ ఇంట్లో రక్తం మరకలను గుర్తించారు. నార్కో పరీక్షకు అతడు నిరాకరించడంతోపాటు స్వీటీ ఆచూకీ కోసం శ్రద్ధ చూపకపోవడంతో మరింతగా అనుమానించి నిఘా పెట్టారు. చివరకు 48 రోజుల తర్వాత అజయ్ దేశాయ్ని నిందితుడిగా నిర్ధారించారు. అతడితోపాటు సహకరించిన స్నేహితుడు జడేజాను అరెస్ట్ చేశారు.