రాజన్న సిరిసిల్ల : పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టివ్వాలని తెలంగాణ ఉద్యమ సమయంలోనే కేసీఆర్ అన్నారు. అన్నమాట ప్రకారమే అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ పేదల ఆత్మగౌరవం నిలబడేలా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించి ఇస్తున్నారు. పట్టిన పట్టు, చెప్పిన మాట తప్పనోడు కేసీఆర్ అని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో రూ. 10.56 కోట్లతో నిర్మించిన 168 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్కుమార్, ఎంపీ సంతోష్కుమార్తో కలిసి మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి వేముల పాల్గొని మాట్లాడుతూ.. దేశంలో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టివ్వాలని దేశంలో ఏ నాయకుడికైనా తోచిందా అని ప్రశ్నించారు. తెలంగాణలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తామంటే ఇతర రాష్ట్రాల సీఎంలు, మంత్రులు నమ్మలేదన్నారు. కానీ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ 2 లక్షల 67 వేల ఇళ్లను మంజూరు చేసి రూ. 19 వేల కోట్లతో ఇళ్ల నిర్మాణం చేపట్టారన్నారు. ఇప్పటికే లక్ష 67 ఇళ్ళు పూర్తైనట్లు తెలిపారు. కేటీఆర్ ఎమ్మెల్యే కావడం సిరిసిల్ల వాసుల అదృష్టం అన్నారు. పారిశ్రామికవేత్తలు పరిశ్రమల స్థాపన కోసం తెలంగాణ వైపు చూస్తున్నట్లు చెప్పారు. ఉపాధి కల్పన కోసం పరిశ్రమల కోసం మంత్రి కేటీఆర్ పని చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.