హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): బాసరలోని రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ)లో పాలిసెట్ ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ ఒక్క ఏడాది మాత్రమే పాలిసెట్ ఆధారంగా సీట్లు భర్తీచేయాలని వర్సిటీ అధికారులు నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించారు. ఒకటిరెండు రోజుల్లో పాలిసెట్ ద్వారా సీట్ల భర్తీకి అనుమతిస్తూ ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నట్టు తెలుస్తున్నది. ఆర్జీయూకేటీలో ఆరేండ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సును నిర్వహిస్తున్నారు. మొత్తం 1,500 సీట్లు ఉండగా, వీటన్నింటినీ పదోతరగతి మార్కుల ఆధారంగానే భర్తీచేస్తున్నారు. సీట్ల భర్తీకి ఎలాంటి ప్రవేశ పరీక్షను నిర్వహించరాదన్న నిబంధన ఆర్జీయూకేటీ బైలాస్లో ఉన్నది. ఈ నేపథ్యంలోనే మొదటినుంచి ఎస్సెస్సీ మార్కుల ఆధారంగానే ప్రవేశాలు కల్పిస్తున్నారు.
రెండేండ్లుగా ఎస్సెస్సీ పరీక్షలను రద్దుచేస్తుండటం, ఫార్మేటివ్ అసెస్మెంట్ ఆధారంగా మార్కులేయడంతో లక్షల మంది విద్యార్థులు 10 జీపీఏ పొందుతున్నారు. దీంతో సీట్ల భర్తీకి అడ్డంకులు ఎదురవుతున్నాయి. 2018లో 4,768 మంది, 2019లో 8,676 మందికి 10 జీపీఏ రాగా, ఎస్సెస్సీ పరీక్షలు రద్దుతో గతేడాది 1.41 లక్షలు, ఈ ఏడాది 2.10 లక్షల మంది విద్యార్థులు 10 జీపీఏ సొంతం చేసుకున్నారు. దీంతో ఆర్జీయూకేటీ సీట్ల భర్తీపై ఆయోమయం నెలకొన్నది. ఇంతమందికి ప్రవేశాలు కల్పించడమెలా అన్న సందిగ్ధతకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఇక నుంచి ఏటా సీట్లను పాలిసెట్ ద్వారా భర్తీచేయాలని అధికారులు భావించారు. కానీ వర్సిటీ బైలాస్ను పరిశీలించగా, ఇది సాధ్యంకాదన్న నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుత ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ ఒక్క ఏడాది పాలిసెట్ ద్వారా భర్తీ చేసేందుకు అనుమతివ్వాలని కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.