శంషాబాద్ : రాత్రి వేళల్లో ఒంటరిగా వెళుతున్న వాహనదారులను టార్గెట్ చేసి వారిపై దాడికి పాల్పడి భయభ్రాంతులకు గురి చేస్తూ దారి దోపిడీలకు పాల్పడుతున్న 6 గురు సభ్యులు గల అంతరాష్ట్ర దొంగల ముఠాను ఎస్ఓటి, సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు గురువారం శంషాబాద్ డీసీపీ ప్రకాశ్రెడ్డి వెల్లడించారు.
గత కొన్నిరోజులుగా రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి, చెవెళ్ల, సంగారెడ్డి, పరిసరా ప్రాంతాలలో అర్ధరాత్రి దోపిడీలకు పాల్పడుతున్న ఆగంతకులతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు సైబరాబాద్ కమీషనర్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
వారి వద్ద నుంచి చోరీలకు గురైన వస్తువులతో పాటు వాహనదారులను భయభ్రాంతులకు గురి చేసేందుకు వాడిన ఇనుపరాడ్లు, ఎయిర్పిస్టల్, కత్తి తదితర మారణాయుధాలను కూడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్కు చెందిన మహ్మద్ హర్షద్ ఖాన్ శంకర్పల్లిలో నివాసం ఉంటూ కార్పెంటర్ పనిచేసేవాడు.
అదే ప్రాంతానికి చెందిన జావేద్ చవాన్, షారూఖ్,మహ్మద్ అఫ్జల్, అక్బర్ చవాన్, మహ్మద్ ఫైజాన్ లు ఉపాధికోసం కర్నాటకలోని బెంగళూరు వెళ్లారు. అక్కడ పని దొరకకపోవడంతో హర్షద్ వద్దకు వచ్చారు. వీరంతా విలావంతమైన జీవితం కోసం దోపిడీలు, దొంగతనాలు చేయాలని నిర్ణయించుకుని ముఠాగా ఏర్పడ్డారు.
రాత్రివేళ వాహనదారులను భయభ్రాంతులకు గురి చేసేందుకు అవసరమైన ఇనుపరాడ్లు, ఎయిర్పిస్టల్, కత్తి తదితర మారణాయుధాలను సమకూర్చుకున్నారు. ఓ కారును అద్దెకు తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి, చెవెళ్ల, సంగారెడ్డి, పరిసర ప్రాంతాలలో అర్ధరాత్రి దోపిడీలకు పాల్పడ్డారు.
ప్రజల ఫిర్యాదుతో సైబరాబాద్ పోలీసులు, ఎస్ఓటి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితులను పట్టుకున్నారు. అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వారి నుంచి సొమ్ము రికవరీ చేశారు. మారణాయుధాలను, కారును సీజ్ చేశారు. నిందితులపై పడి యాక్ట్ అమలు చేయనున్నట్లు డీసీపీ పేర్కొన్నారు.