సింగపూర్ : పనిమనిషిని చిత్రహింసలతో వేధించి ఆమె మరణానికి కారణమైన భారత సంతతికి చెందిన మహిళకు సింగపూర్ న్యాయస్ధానం 30 ఏండ్ల జైలు శిక్ష విధించింది. 2016 జులై 26న గాయత్రి మురుగయన్ (41) ఇంట్లో పనిచేసే మయన్మార్కు చెందిన పియంగ్ నిడాన్(24) యజమానురాలి చిత్రహింసలు తాళలేక ప్రాణాలు విడిచారు. గాయత్రి, ఆమె తల్లి పనిమనిషిని తీవ్రంగా వేధించారు. మే 2015లో గాయత్రి ఇంట్లో పనిచేసేందుకు పియంగ్ సింగపూర్ వచ్చారు.
14 నెలల పాటు గాయత్రి ఇంట పనిచేస్తూ పియంగ్ నరకం అనుభవించారు. పియంగ్కు ఆహారం ఇవ్వకుండా పస్తులు ఉంచడం, అకారణంగా దాడి చేయడం, వేడి వస్తువులతో కొట్టడం, పదునైన ఆయుధాలతో హింసించడం వంటి 28 అభియోగాలు గాయత్రిపై నమోదయ్యాయి. బాధితురాలిని నిందితురాలు తీవ్రంగా, అత్యంత దారుణంగా హింసించిన తీరు చివరికి నిందితురాలి చేతిలోనే బాధితురాలు ప్రాణాలు విడిచిన తీరును ప్రాసిక్యూషన్ కండ్లకు కట్టిందని తీర్పును వెలువరిస్తూ న్యాయమూర్తి సీకీ ఊన్ పేర్కొన్నారు.