న్యూఢిల్లీ : చట్టవిరుద్ధంగా కాల్ సెంటర్ నడుపుతూ విదేశీయులు టార్గెట్గా మోసానికి పాల్పడుతున్న ముఠా గుట్టును గురుగ్రాం పోలీసులు రట్టు చేశారు. అమెరికా, కెనడాకు చెందిన వారికి వాయిస్ మెసేజ్లు చేస్తూ వారి సోషల్ సెక్యూరిటీ నంబర్లు రద్దవుతాయని బెదిరిస్తూ డబ్బు గుంజుతున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఆన్లైన్ చెల్లింపుల ద్వారా గిఫ్ట్ కార్డులు కొనుగోలు చేయాలని కాల్సెంటర్ ఉద్యోగులు విదేశీయులకు వాయిస్ మెసేజ్లు పంపుతున్నట్టు గుర్తించామని పోలీసులు తెలిపారు.
నిందితులు ఇచ్చిన టోల్ఫ్రీ నెంబర్లకు కాల్ చేసిన విదేశీయులకు తాము సంబంధిత అధికారులని చెబుతూ బాధితులను గిఫ్ట్ కార్డులు కొనుగోలు చేయడం ద్వారా చెల్లింపులు చేయాలని బెదిరిస్తారని దర్యాప్తులో తేలిందని చెప్పారు. గురుగ్రాంలోని స్పేజ్ ప్లాజో భవనంపై దాడులు చేసిన పోలీసులు విదేశీయులకు కాల్ చేసేందుకు అవసరమైన సాఫ్ట్వేర్ను లోడ్ చేసిన కంప్యూటర్లను గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.