హైదరాబాద్ : అనుమానమే పెనుభూతమైంది. భార్యపై అనుమానం పెంచుకొని కొట్టి చంపాడు ఓ భర్త. పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పటాన్చెరు మండలం రుద్రారం గ్రామానికి చెందిన సురేశ్ పాశం మైలారం పారిశ్రామికవాడలో ఓ ప్రైవేట్ కంపెనీలో డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
పదేళ్ల క్రితం సురేశ్కు అదే గ్రామానికి చెందిన స్వప్న(31)తో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. సురేశ్ సోమవారం రాత్రి ఇంటికొచ్చే సరికి భార్య స్వప్న ఫోన్లో మాట్లాడుతూ కనిపించింది.
దీంతో అనుమానం వచ్చిన సురేశ్ ఆమెను తీవ్రంగా కొట్టాడు. గాయాలపాలై ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లగా సురేశ్ తల్లిదండ్రులు స్వప్న తమ్ముడు లక్ష్మణ్కు సమాచారం ఇచ్చారు.
వెంటనే అతడు వచ్చి స్వప్నను చికిత్స కోసం ఇస్నాపూర్ ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యుల సూచన మేరకు పటాన్చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని సురేశ్ను అదుపులోకి తీసుకున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.