వెంగళరావునగర్, మే 16 : భార్యను ఇనుప రాడ్డుతో తలపై కొట్టి హతమార్చిన భర్త సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం ఉదయం ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డిగూడకు చెందిన జనార్దన్ (40)కు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా తూముకుంటకు చెందిన ప్రేమలత (35)తో 2004లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. ఏ పని చేయకుండా ఇంట్లోనే ఉంటున్న భర్త జనార్దన్ తరచూ భార్యతో గొడవ పడుతుండేవాడు. భార్య ప్రేమలత కూకట్పల్లిలోని ఓ డెంటల్ ఆసుపత్రిలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నది. గత నెల 1వ తేదీన జనార్దన్ భార్యతో గొడవ పడి ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయాడు. భార్య ప్రేమలత ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న ఎస్ఆర్నగర్ పోలీసులు ఆచూకీ కనిపెట్టి ఇంటికి చేర్చారు.
ఇదిలా ఉండగా ప్రేమలత తల్లిదండ్రులైన మంచాల లక్ష్మి, యాదయ్యల వివాహ వార్షికోత్సవానికి జనార్దన్ దంపతులు సోమవారం తూముకుంటకు వెళ్లారు. కార్యక్రమం ముగిసిన తరువాత వారు రాత్రి 10:30 గంటలకు ఎల్లారెడ్డిగూడలోని ఇంటికి చేరుకున్నారు. వేసవి సెలవులు కావడంతో పిల్లలిద్దరు అమ్మమ్మ ఇంట్లోనే ఉండిపోయారు. కాగా మంగళవారం ఉదయం వీరు తలుపులు తెరవకపోవడంతో జనార్దన్ తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు తలుపులు బద్దలుకొట్టి చూడగా నోట్లో గుడ్డలు కుక్కి ఉండి, రక్తపు మడుగులో పడి ఉన్న ప్రేమలత, సీలింగ్ ఫ్యాన్కు ఉరి బిగించుకుని జనార్దన్ కనిపించారు. ప్రేమలతను ఇనుప రాడ్డుతో తలపై కొట్టి చంపిన తరువాత తాను ఉరి వేసుకుని మృతి చెందినట్లు తెలుస్తున్నది. ప్రేమలత తల్లి మంచాల లక్ష్మి ఫిర్యాదు మేరకు ఎస్ఆర్నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.