ఖానాపురం, మే 12: రైతుల మేలు కోసమే తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామినాయక్ అన్నారు. బుధవారం ఆయన మండలంలోని ఖానాపురం, కొత్తూరు, రంగాపురం, బుధరావుపేట, ధర్మరావుపేట, మంగళవారిపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. రైతులకు ఎలాంటి సమస్య తలెత్తినా తనను సంప్రదించాలని కోరారు. ధాన్యం తరలించడానికి లారీలు, గన్నీ సంచుల కొరత లేదన్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి వెళ్లిన ధాన్యాన్ని మిల్లర్లు సకాలంలో అన్లోడ్ చేయాలని కోరారు. ఆయన వెంట సొసైటీ వైస్ చైర్మన్ వేణుకృష్ణ, సొసైటీ సీఈవో ఆంజనేయులు, సిబ్బంది రాజు ఉన్నారు.
రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దు
ఆత్మకూరు: నిబంధనల మేరకే నిర్వాహకులు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని గూడెప్పాడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ కాంతాల కేశవరెడ్డి అన్నారు. పెద్దాపురం, అగ్రంపహాడ్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ మార్క సుమలత-రజినీకర్గౌడ్, జడ్పీటీసీ కక్కెర్ల రాధిక-రాజు, సర్పంచ్లు సావురే కమల, కంచె రవికుమార్, మాదాసి అన్నపూర్ణ, ఐకేపీ ఏపీఎం లలితాదేవి పాల్గొన్నారు. కాగా, గూడెప్పాడ్ మార్కెట్ కార్యదర్శి కుమారస్వామి ఇటీవల కరోనా వైరస్తో మృతి చెందగా, ఆయన చిత్రపటం వద్ద కేశవరెడ్డి నివాళులర్పించారు. ఆయన వెంట మార్కెట్ కార్యదర్శి వేముల వెంకటేశ్వర్లు, డైరెక్టర్లు, సిబ్బంది ఉన్నారు.
రైతులు ఆందోళన చెందొద్దు
పరకాల/పర్వతగిరి: తడిచిన ధాన్యంపై రైతులు ఆందోళన చెందొద్దని వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నందికొండ జైపాల్రెడ్డి అన్నారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో అకాల వర్షంలో తడిచిన ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. ధాన్యాన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని భరోనా ఇచ్చారు. పర్వతగిరి మండలం కల్లెడ పీఏసీఎస్ చైర్మన్ మోటపోతుల మనోజ్గౌడ్ మండలంలోని అన్నారం, బూర్గుమల్ల, కల్లెడ, పెద్దతండాలోని కొనుగోలు కేంద్రాలకు పరిశీలించారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట వరంగల్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ఏడుదొడ్ల జితేందర్రెడ్డి, డైరెక్టర్లు దొమ్మటి లక్ష్మీనారాయణ, అశోక్రెడ్డి ఉన్నారు.
మిల్లులకు చేరుతున్న ధాన్యం
శాయంపేట: మండలంలోని మిల్లులకు లారీలు, ట్రాక్టర్లలో పెద్ద ఎత్తున ధాన్యం చేరుకుంటున్నది. మద్దతు ధరతో రైతుల నుంచి ఐకేపీ, పీఏసీఎస్ నిర్వాహకులు ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. కేటాయించిన మిల్లులకు నిర్వాహకులు లారీల్లో ధాన్యం బస్తాలను తరలిస్తున్నారు.