చండీగఢ్: ఒక పోలీస్ అధికారి కారు ఇద్దరు యువతులను ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనలో ఒకరు మరణించగా మరొకరు గాయపడ్డారు. పంజాబ్లోని జలంధర్లో సోమవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. జలంధర్ కంటోన్మెంట్ ప్రాంతంలో జలంధర్-ఫగ్వారా హైవేను దాటేందుకు ఇద్దరు యువతులు ప్రయత్నించారు. అయితే ఒక కారు వేగంగా వస్తుండటంతో వెనక్కివెళ్లారు. అంతలోనే ఆ కారు వారిని ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. కార్ షోరూమ్లో పని చేసే నవజోత్ కౌర్ మరణించగా తీవ్రంగా గాయపడిన మరో యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది.
ఇద్దరు మహిళలపైకి తెల్లని కారు దూసుకెళ్లిన ఘటన సీసీటీవీలో రికార్డైంది. ఆ కారును పోలీస్ ఇన్స్స్పెక్టర్ అమృత్ పాల్ సింగ్ డ్రైవ్ చేస్తున్నట్లు గుర్తించి ఆయనను అరెస్ట్ చేశారు. మరోవైపు ఈ ప్రమాదం అనంతరం స్థానికులు పెద్ద సంఖ్యలో రహదారిపైకి చేరి నిరసన తెలిపారు. దీంతో వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్కు బాగా అంతరాయం ఏర్పడింది.
విధులకు వెళ్తున్న తమ కుమార్తె మరణానికి కారణమైన పోలీస్ ఇన్స్స్పెక్టర్ అమృత్ పాల్ సింగ్పై హత్య కేసు నమోదు చేయాలని నవజోత్ కౌర్ తల్లి డిమాండ్ చేశారు.