నిజాంసాగర్ : నిజాంసాగర్ మండలంలోని సుల్తాన్నగర్ గ్రామంలో హెచ్పీ గ్యాస్ డీలర్ బచ్చు నాగరఘు మహావీర్(38) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై సయ్యద్ హైమద్ తెలిపారు. నిజామాబాద్ పట్టణానికి చెందిన నాగరఘు మహవీర్ బంధువులతో కలిసి హెచ్పీ గ్యాస్ డీలర్షిప్ పొంది గ్యాస్ ఎజెన్సీని నిర్వహిస్తున్నాడు. కొన్ని రోజులుగా అతడి మానసిక స్థితి సక్రమంగా లేకపోవడంతో మంగళవారం సాయంత్రం గ్యాస్ ఎజెన్సీ కార్యాయానికి వచ్చిఇంటికి తిరిగి రాలేదు. బుధవారం ఉదయం వాచ్మెన్ తలుపులు తీసేందుకు ప్రయత్నిస్తే లోపల గడియ వేసుకొని ఉండడంతో ఈ విషయాన్ని బందువులకు సమాచారం అందించారు.
వారు వచ్చి ఎంత పిలిచినా స్పందన లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించి తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి పరిశీలించగా ఉరేసుకుని ఉన్నాడని తెలిపారు. బంధువులు ప్రవీణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు.