తిరుమల,జూలై 3: టీటీడీ కౌంటర్ల నిర్వహణ టెండర్లలో అవకతవకలు జరిగాయని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని, దాదాపు 18 నెలల్లో ఐదు సార్లు ప్రొఫెషనల్ ఎక్స్ పీరియన్స్ ఉన్న ఏజెన్సీల నుంచి టెండర్లు ఆహ్వానించి టిటిడి నిబంధనల మేరకు పారదర్శకంగా ఎంపిక చేసినట్లు టిటిడి అదనపు ఈవో ఏ.వి.ధర్మారెడ్డి స్పష్టం చేశారు.
తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. టిటిడి భక్తుల సౌకర్యార్థం అనేక కార్యక్రమాలు చేపడుతున్నదని,ఆ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి 176 కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ఉచిత దర్శన టికెట్ల జారీకి,టోల్ గేట్ల వద్ద టోకన్ల కేటాయింపునకు, గదుల కేటాయింపునకు, లడ్డూల జారీకి కౌంటర్లు నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.