దండం పెడుతాం.. మాస్కు ధరించండి
విస్తృతంగా అవగాహన కల్పిస్తున్న యువకులు, పోలీసులు
ఆమనగల్లు,ఏప్రిల్ 25 : కరనా వైరస్ను కట్టడి చేసేందుకు మున్సిపాలిటీ పరిధిలో ఎన్ఎస్యూఐ విద్యార్థులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రెండు రోజులుగా పట్టణంతో పాటు గ్రామాల్లో మాస్కులు, భౌతికదూరం, శానిటైజేషన్ చేసుకునే విధానంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఆదివారం బస్టాండ్ ఆవరణ, ప్రధాన కూడలి, వ్యాపార దుకాణాల వద్దకు వేళ్లి దండం పెడుతాం మాస్కు ధరించండంటూ అవగాహన కల్పించారు. మాస్కు అత్యుత్తమ రక్షణగా ప్రతి ఒక్కరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన సూచనలు పాటించాలని కోరారు. కార్యక్రమంలో ఎన్ఎస్యూఐ నాయకులు ఫిరోజ్, ఫరీద్, మహేశ్ పాల్గొన్నారు.
కరోనాపై అప్రమత్తంగా ఉండాలి
మంచాల, ఏప్రిల్ 25 : కరోనాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యం వహిస్తే బాధితులుగా మారుతారని సీఐ వెంకటేశ్గౌడ్ అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. కరోనా రోజురోజుకూ విస్తరిస్తున్నందున ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలన్నారు. రాత్రి 9గంటల నుంచి ఉదయం 5గంటల వరకు ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ సమయంలో బయట తిరిగితే చర్యలు తప్పవన్నారు. మాస్కు ధరించకుండా రోడ్లపై తిరిగిన వారికి జరిమానా తప్పదన్నారు.
జాగ్రత్తలు తీసుకోవాలి
యాచారం, ఏప్రిల్ 25 : కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సీఐ లింగయ్య అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న కర్ఫ్యూను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. 9గంటలలోపు అన్ని దుకాణాలు, హోటళ్లు బంద్ చేయాలన్నారు. అత్యవసర సమయంలో గుర్తింపు కార్డును చూపించాలన్నారు. మాస్కు లేకుండా రోడ్లపైకి వస్తే రూ.1000 జరిమానా విధించనున్నట్లు పేర్కొన్నారు.
19 మందికి పాజిటివ్
అబ్దుల్లాపూర్మెట్, ఏప్రిల్ 25 : ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 63 మందికి ఆదివారం ర్యాపిడ్ యాంటిజన్ పరీక్షలు నిర్వహించారు. అందులో 19 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి శ్వేత తెలిపారు. బాధితులకు ఉచితంగా మందులు పంపిణీ చేశామన్నారు. ప్రజలు భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్కు తప్పని సరిగా ధరించాలన్నారు. బాధితులు క్రమం తప్పకుండా మందులు వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో హెచ్ఈవో గోపాల్, సూపర్వైజర్లు, ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.