బంజారాహిల్స్ : రెండునెలల క్రితం గుండెపోటుతో చనిపోయాడని బావించిన ఓ వ్యక్తి హత్యకు గురయినట్లు ఆరోపణలు రావడంతో బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిద్రపోతున్న తన తండ్రిని తల్లి చున్నీతో హత్య చేసిందం టూ పదకొండేళ్ల కొడుకు బంధువులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంచలనం సృష్టిస్తున్న సంఘట న వివరాలు ఇలా ఉన్నాయి.
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పట్టణంలోని మధురానగర్కు చెందిన జగదీష్ (43)కు కాకినాడలోని గాంధీనగర్కు చెందిన శ్రీసుశ్రుతతో 2007లో పెళ్లయింది. వారికి రోహిత్ వెంకటసత్య(11) అనే కొడుకు ఉన్నాడు. కాగా బతుకు దెరువుకోసం ఇటీవల నగరానికి వచ్చిన జగదీష్ దంపతులు ఫిలింనగర్లో గది అద్దెకు తీసుకుని ఉండేవారు. సుశ్రుత సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తుండగా జగదీష్ డ్రైవర్గా పనిచేసేవాడు.
కాగా జూలై 15న ఉదయం 6గంటలకు కాకినాడలో ఉండే జగదీష్ తమ్ముడు రాజేష్కు ఫోన్ చేసిన సుశ్రుత జగదీష్కు గుండెపోటు రావడంతో చనిపోయాడని చెప్పింది. దాంతో మృతదేహాన్ని తీసుకుని కాకినాడకు రావాలని రాజేష్తో పాటు బంధువులు చెప్పడంతో అంబులెన్స్ మాట్లాడుకున్న సుశ్రుత అక్కడకు తీసుకువెళ్లింది. మరుసటిరోజున జగదీష్ మృత దేహానికి అంత్యక్రియలు పూర్తిచేశారు. అంత్యక్రియల అనంతరం సుశ్రుత తన కొడుకును తీసుకుని గాంధీనగర్లోని పుట్టింటికి వెళ్లిపోయింది. కాగా కొడుకును ఈనెల 9న కాకినాడలోని పెదనాన్న ప్రసాద్ ఇంట్లో వదిలిపెట్టిన సుశ్రుత ఉద్యోగం కోసం హైదరాబాద్కు వచ్చేసింది.
కాగా తల్లి వెళ్లిన తర్వాత కొడుకు రోహిత్ వెంకట్ సత్య పెదనాన్నతో పాటు కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ తండ్రి జగదీష్ను తల్లే చంపేసిందని బోరున విలపించాడు. జూలై 15న తెల్లవారుజామున 4.30 ప్రాంతంలో నిద్రపోతున్న తండ్రి మెడకు చున్నీ బిగించి చంపిందని చెప్పాడు. తాను నిద్రపోతున్నట్లు నటించడంతో గుండెపోటు వచ్చిందని చెప్పిందని, ఇన్నాళ్లూ భయంతో ఈ విషయం ఎవరికీ చెప్పలేదని రోహిత్ చెప్పాడు.
దాంతో తమ సోదరుడి మృతిపై అనుమానాలు ఉన్నాయని బుధవారం రాత్రి జగదీష్ అన్న ప్రసాద్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా జగదీష్ మృతదేహాన్ని ఖననం చేయడంతో రీ పోస్ట్మార్టం చేయాల్సి ఉంటుందని, ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా తదుపరి విచారణ చేపట్టేందుకు పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు.
జగదీష్ మృతి చెందిన రోజున ఏం జరిగిందనే విషయాన్ని గురించి లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మృతుడి కొడుకు చెప్పినట్లు చున్నీతో బిగించి చంపితే గొంతువద్ద ఉన్న ఎముకలు విరిగి ఉంటాయని, పోస్ట్మార్టం నివేదకలో కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కాగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సుశ్రుతను ప్రశ్నించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఫిలింనగర్లో గది ఖాళీ చేసి వేరేచోట ఉండడంతో ఆమె ఆచూకీకోసం గాలిస్తున్నారు.