అమీర్పేట్ : తనకు తెలియకుండా గర్భం తొలగించుకుందనే కోపంతో భర్త తన భార్యను గొంతు నులిమి హత్య చేసిన ఘటన సనత్నగర్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జగద్గిరిగుట్టకు చెందిన గంగాధర్ పైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి నిజామాబాద్కు చెందిన మానస (24)తో గత నవంబర్లో వివాహమైంది.
అయితే వివాహమైన రెండు నెలలకే భర్త వేధింపులకు గురి చేస్తున్నాడంటూ జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం మానస తన తల్లిందండ్రుల వద్దకు వెళ్లిపోయింది. అయితే పెద్దల జోక్యంతో తిరిగి భర్త దగ్గరకు చేరిన మానసకు మళ్లీ భర్త నుండి వేధింపులు తలెత్తడంతో మరోసారి పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ నేపధ్యంలో గర్భం దాల్చిన మానస పుట్టింట్లోనే ఉంటోంది. భార్య పుట్టింటికి వెళ్లినప్పటి నుండి గంగాధర్ సనత్నగర్ పీఎస్ పరిధిలోని భరత్నగర్లో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నాడు.
అయితే కొద్ది రోజుల క్రితం భర్తకు తెలియకుండా మానస తన గర్భాన్ని తొలగించుకుంది. గంగాధర్ తండ్రి మృతి చెందడంతో మానస జగద్గిరిగుట్టకు వచ్చింది. దశదిన కార్యక్రమాలు పూర్తయిన తరువాత ఆదివారం సాయంత్రం భర్త గంగాధర్ జగద్గిరిగుట్ట నుండి తన భార్య మానసను భరత్నగర్లోని తన ఇంటికి తీసుకువచ్చాడు.
ఇదిలా ఉంటే మరోసారి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తాను గర్భం తొలగించుకున్నట్టు చెప్పడంతో ఆవేశంతో గంగాధర్ భార్యను గొంతు నులమడంతో ఊపిరాడక మానస మృతి చెందింది. విషయం తెలుసుకున్న సనత్నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని గంగాధర్ కోసం గాలిస్తున్నారు.