పరిశ్రమలు, పారిశ్రామిక వాడల పేరు చెప్పగానే చాలా మందికి కాలుష్యం గుర్తుకు వస్తుంది. కానీ ఆ పరిశ్రమలే ఇప్పుడు మనుషులకు ఊపిరి పోస్తున్నాయి. ఓ వైపు కరోనా మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంటే.. దవాఖానల్లో వెంటిలెటర్లపై ప్రాణాపాయస్థితిలో ఉన్న వారికి పరిశ్రమలు పునర్జన్మను ప్రసాదిస్తున్నాయి. నగర శివారులోని పరిశ్రమలతోనే శ్వాస సంబంధ ఇబ్బందులు వస్తాయని చెప్పిన వారికి కూడా శ్వాసను అందిస్తున్నాయి. మేడ్చల్ జిల్లాలో సుమారు తొమ్మిది ఆక్సిజన్ ఉత్పత్తి, రీఫిల్లింగ్ యూనిట్లు ఉండగా, రంగారెడ్డి జిల్లాలో సుమారు 3-4 ఆక్సిజన్ యూనిట్లు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
మేడ్చల్ జిల్లాలోని ఈ తొమ్మిది ఆక్సిజన్ ఉత్పత్తి/రీఫిల్లింగ్ పరిశ్రమల నుంచి ఈ నెల 23వ తేదీ నుంచి 28వ తేదీ వరకు సుమారు 147369.82 క్యూబిక్ మీటర్ల ఆక్సిజన్ నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోవిడ్/జనరల్ దవాఖానలకు సరఫరా అవుతున్నది. ప్రస్తుతం ఉన్న ఆక్సిజన్ డిమాండ్, ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని మేడ్చల్ జిల్లాలోని సుమారు 9 ఆక్సిజన్ ఉత్పత్తి/రీఫిల్లింగ్ పరిశ్రమలు 24/7గంటల పాటు ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తున్నాయి. ప్రతి రోజు సుమారు 31174.4 క్యూబిక్ మీటర్ల (44.38 మెట్రిక్ టన్నులు)ఆక్సిజన్ను రాష్ట్రవ్యాప్తంగా సరఫరా చేస్తున్నాయి. అయితే కేవలం రీఫిల్లింగ్ యూనిట్లు మాత్రం మహాబూబ్నగర్ జిల్లాలోని ఓ ఆక్సిజన్ ఉత్పత్తి యూనిట్ నుంచి ఆక్సిజన్ను కొనుగోలు చేసి తీసుకువస్తున్నట్లు ఆయా పరిశ్రమల ప్రతినిధులు తెలిపారు.
రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పారిశ్రామిక వాడల్లోని ఆక్సిజన్ ఉత్పత్తి/రీఫిల్లింగ్ యూనిట్ల మొత్తం సామర్థ్యం ఎంత ? వాటిలో ప్రతి రోజు ఎంత ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది? ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత? ఇప్పటి వరకు దవాఖానలకు ఎంత సరఫరా అయ్యింది అనే అంశాలపై మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే జిల్లా పరిశ్రమల శాఖల అధికారులతో సమీక్షించిన కలెక్టర్లు ప్రతి రోజు సాయంత్రం ఆరు గంటల వరకు నివేదిక తెప్పించుకుంటున్నారు. ఈ యూనిట్ల నుంచి ఉత్పత్తి అయిన ఆక్సిజన్ సరఫరాలో అక్రమాలకు తావులేకుండా అవసరం ఉన్న దవాఖానలకు సరఫరా చేయాలనే సంకల్పంతోనే నిరంతరం కలెక్టర్లు ఆక్సిజన్ సరఫరాను పర్యవేక్షిస్తున్నారు.