లక్నో : యూపీలో మహిళలు, చిన్నారులపై లైంగిక దాడుల ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. బాగ్పట్ జిల్లా బరౌత్ గ్రామంలో ఆరేళ్ల బాలికపై గుర్తుతెలియని వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడి ఆపై దారుణంగా హత్య చేసిన ఘటన వెలుగుచూసింది. బాలిక మృతదేహం ఖాళీ ప్రదేశంలో నిందితులు పడవేశారు. ఈ కేసులో ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నారు. ఎస్పీ అభిషేక్ సింగ్ ఘటనా స్ధలాన్ని డాగ్ స్వ్కాడ్తో కలిసి పరిశీలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం మధ్యాహ్నం బాలిక ఇంటి వెలుపల ఆడుకుంటుండగా అదృశ్యమైంది. ఆ సమయంలో వర్షం పడుతుండటంతో స్ధానికులు ఎవరూ బాలిక కిడ్నాప్ను గమనించలేదు. తమ కుమార్తెను నిందితులు అత్యాచారం చేసి హత్య చేశారని గ్రామంలోని ఖాళీ స్ధలంలో పడేసివెళ్లారని బాధితురాలి తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. త్వరలోనే నిందితులను పట్టకుంటామని ఎస్పీ అభిషేక్ సింగ్ వెల్లడించారు.