లక్నో : యూపీలో మహిళలు, బాలికలపై లైంగిక దాడుల ఘటనలకు తెరపడటం లేదు. చెత్త పడేసేందుకు బయటకు వచ్చిన బాలిక(17)ను ముగ్గురు యువకులు తుపాకీతో బెదిరించి సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఉదంతం ముజఫర్నగర్ జిల్లాలోని ఓ గ్రామంలో బుధవారం వెలుగుచూసింది. బాలిక తండ్రి ఫిర్యాదు ఆధారంగా ముగ్గురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
బాధితురాలి తండ్రి ఫిర్యాదు ప్రకారం జిల్లాలోని న్యూ మండి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో బుధవారం బాలిక చెత్త పడవేసేందుకు బయటకు రాగా అదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు తుపాకీతో బెదిరించి కిడ్నాప్ చేశారు. ఆపై బాలికను అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్లి సామూహిక లైంగిక దాడికి పాల్పడి పరారయ్యారు. నిందితులపై కేసు నమోదు చేశామని వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు.