ముంబై : మహారాష్ట్రలో అత్యంత క్రూరమైన అత్యాచార ఘటన వెలుగు చూసింది. ఓ పదిహేను సంవత్సరాల బాలికపై మానవ మృగాలు విరుచుకుపడ్డాయి. ఒకరిద్దరు కాదు.. ఏకంగా 29 మంది ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
వివరాల్లోకి వెళ్తే థానే జిల్లాలోని దొంబివ్లి పట్టణానికి చెందిన 15 ఏండ్ల బాలికను స్థానికంగా ఉన్న ఓ యువకుడు ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలో ఆ బాలికను లొంగదీసుకున్నాడు. ఈ ఏడాది జనవరిలో ఇద్దరు శారీరకంగా కలిసిన సమయంలో ఆ కామాంధుడు వీడియోలను చిత్రీకరించాడు.
వీడియోలను అడ్డం పెట్టుకుని ఆ మానవ మృగం.. ఆమెను అనేక రకాలుగా హింసించాడు. ఇక తన స్నేహితులతో కూడా సన్నిహితంగా ఉండాలని, లేదంటే ఆ వీడియోలను బయట పెడుతానని బెదిరింపులకు గురి చేశాడు. అలా 29 మందికి ఆమెపై అత్యాచారం చేశారు. ఆమె ఆ బాధలు భరించలేక, పరువు పోయినా పర్లేదు అనుకుని.. బుధవారం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బాలికపై అత్యాచారానికి పాల్పడిన 29 మందిలో 25 మందిని అరెస్టు చేసినట్లు మాన్పాడ పోలీసులు తెలిపారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. మిగతా నలుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అరెస్టు అయిన వారిలో ఇద్దరు మైనర్లు ఉండటంతో వారిని జువైనల్ హోంకు తరలించారు. దొంబివ్లి, ముర్బాద్, బద్లాపూర్, రాబలే, నవీ ముంబైలో తనపై అత్యాచారం చేసినట్లు ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నది.