ముంబై : గత వారం పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన 15 ఏండ్ల బాలిక చదువు విషయమై జరిగిన వాగ్వాదంలో కన్నతల్లిని కరాటే బెల్ట్తో ఊపిరిఆడకుండా చేసి ఉసురుతీసిన ఉదంతం నవీ ముంబైలో వెలుగుచూసింది. జులై 30న తల్లిని దారుణంగా హత్య చేసిన బాలిక ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. అయితే అటాప్సీ నివేదికలో హత్యగా వెల్లడైందని దర్యాప్తు అధికారి తెలిపారు.
పదో తరగతి పరీక్షలో పాసయిన కుమార్తెను బాగా చదువుకుని వైద్య విద్యను అభ్యసించాలని తల్లి (40) కోరగా ఈ విషయంలో ఇద్దరి మధ్య వాదులాట జరగ్గా బాలిక కోపంతో తల్లిని కడతేర్చిందని పోలీసులు వెల్లడించారు. తల్లిని హత్య చేసిన అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు బాలిక తన మేనమామకు ఫోన్ చేసి తమ తల్లి గదిలోపలికి వెళ్లి తలుపు వేసుకుని తీయడం లేదని చెప్పినట్టు పోలీసులు పేర్కొన్నారు.
పోస్ట్మార్టం నివేదికలో తలపై గాయాలతో పాటు ఊపిరిఆడకుండా చేయడంతో మరణించినట్టు వెల్లడైందని చెప్పారు. బాలికను అదుపులోకి తీసుకుని జువెనిల్ బోర్డు ఎదుట ప్రవేశపెడతామని తెలిపారు. తల్లిని కన్నకూతురు దారుణంగా హత్య చేయడం నవీ ముంబై ప్రాంతంలో కలకలం రేపింది.