గురుగ్రాం : హర్యానాలో దారుణం జరిగింది. పదేండ్ల బాలికపై ఆరుగురు మైనర్లు సహా ఏడుగురు బాలురు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. రెవారి జిల్లాలోని పాఠశాలలో మే 24న జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో కలకలం రేగింది. నిందితుల్లో ఒకరు ఈ దారుణాన్ని వీడియో తీశారు. తన మొబైల్ ఫోన్ లో లైంగిక దాడి ఘటన క్లిప్ ను చూసిన బాలిక పొరుగింటి వ్యక్తి బాధితురాలి కుటుంబ సభ్యులకు తెలిపాడు.
ఆట స్ధలం పక్కనే ఉన్న పాఠశాలలో నిందితులు బాలికపై దారుణానికి ఒడిగట్టారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదుపై మహిళా పోలీస్ స్టేషన్ లో బుధవారం కేసు నమోదైంది. నిందితుల్లో ఆరుగురు మైనర్లు కాగా, ఒక యువకుడి వయసు 18 ఏండ్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితులపై లైంగిక దాడి కేసుతో పాటు, పోక్సో, సైబర్ చట్టాల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు.