లక్నో: యూపీలో మహిళలు, బాలికలపై లైంగిక నేరాలకు తెరపడటం లేదు. మాయమాటలు చెప్పి మైనర్ బాలికను పండ్ల తోటలోకి తీసుకువెళ్లిన ఇద్దరు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన ముజఫర్నగర్ జిల్లాలో వెలుగుచూసింది. నిందితులు తమ నేరాన్ని వీడియోలో రికార్డు చేసి ఇంటర్నెట్లో వైరల్ చేయడం కలకలం రేపింది. ఈ ఘటన నేపధ్యంలో భయంతో బాలిక ఇంటి నుంచి పారిపోయింది. బాలిక ఆచూకీని పసిగట్టిన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు గాలింపు ముమ్మరం చేశారు.
జిల్లాలోని భోపా ప్రాంతంలో ఈ దారుణ ఘటన జరిగింది. తన కుమార్తె (17)ను గ్రామానికి చెందిన శుభం పండ్ల తోటలోకి తీసుకువెళ్లాడని, అక్కడ మరో నిందితుడు ఆశిష్తో కలిసి లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధిత తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని నిందితులు బాలికను హెచ్చరించారు. నేరాన్ని వీడియోలో రికార్డు చేసిన అనంతరం బాలికను ఇంటివద్ద విడిచిపెట్టారు. నిందితులు సోషల్ మీడియాలో వీడియో క్లిప్ను అప్లోడ్ చేసిన తర్వాత బాలిక కుటుంబసభ్యులకు ఈ విషయం తెలిసింది.
బాలిక తల్లితండ్రులు ఘటన గురించి ప్రశ్నించగా భయంతో బాధితురాలు శనివారం సాయంత్రం ఇంటినుంచి పారిపోయింది. కుటుంబసభ్యులు వెంటనే నిందితులు ఆశిష్, శుభంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామం వెలుపల కనిపించిన బాలికను పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం దవాఖానకు తరలించారు. నిందితులను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని సీఐ గిరిజా శంకర్ త్రిపాఠి తెలిపారు.