భువనేశ్వర్ : పద్నాలుగేళ్ల బాలికను అపహరించిన ఇద్దరు వ్యక్తులు మూడు రోజుల పాటు బాధితురాలిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఒడిషాలోని నవరంగపూర్ జిల్లాలో కలకలం రేపింది. అక్టోబర్ 10న ఈ ఘటన జరగ్గా బాధితురాలి తల్లి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించి నిందితులు ఉమేష్ హరిజన్, సంతోష్ టక్రిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పపదహండి బ్లాక్కు చెందిన తురుంజగుడ గ్రామానికి చెందిన బాలిక కాలకృత్యాలు తీర్చుకునేందుకు సమీపంలోని పొలానికి వెళ్లగా నిందితులు ఆమెను కారులో కిడ్నాప్ చేసి కోరాపుట్ జిల్లా సునబెడ గ్రామానికి తీసుకువెళ్లారు. బాలికపై అదే గ్రామంలో వరుసగా మూడురోజుల పాటు నిందితులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆపై బాధితురాలిని సెమాల్ గ్రామంలో విడిచివెళ్లారు. నిస్సహాయ స్ధితిలో బాలికను గుర్తించిన తల్లితండ్రులు ఆమెను కాపాడి ఇంటికి తీసుకువచ్చారు. స్దానికుల సహకారంతో బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా ఆదివారం ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.