సిటీబ్యూరో, ఆగస్టు 11 : కరుడుగట్టిన ఘరాన దొంగను సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి రూ. 18 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నగర పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ అంజనీకుమార్ వివరాలను వెల్లడించారు. మహ్మద్ సలీమ్ అలియాస్ సునీల్శెట్టి ఫలకునుమా, నవాబ్ సాహెబ్ కుంటకు చెందిన వాడు.
1991 నుంచి నేరాలు చేస్తూ ఇప్పటి వరకు 160 దొంగతనాలు చేశాడు. మధ్య తరగతి కుటుంబాలనే లక్ష్యంగా చేసుకొని ఆయా ఇండ్లలో దొంగతనాలు చేస్తూ పలుమార్లు పోలీసులకు పట్టుబడ్డాడు. 2018లో కంచన్బాగ్ పోలీసులు ఇతనిపై పీడీయాక్టు ప్రయోగించారు. 2021 మార్చి నెలలో జైలు నుంచి బయటకు వచ్చి తిరిగి దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. హైదరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత 12 ఇండ్లలో దొంగతనాలకు పాల్పడ్డాడు.
చాంద్రాయణగుట్ట, ఫలకునుమా, ఛత్రినాక, పహాడీషరీఫ్, బాలాపూర్ స్టేషన్ల పరిధిలో ఆయా కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే సీసీ కెమెరాలు ఎక్కువగా సిటీలో పెట్టడంతో తనను పోలీసులు త్వరగా గుర్తిస్తారనే ఉద్దేశంతో ఇటీవల జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత సీసీ కెమెరాలు లేని ప్రాంతాలను ఎంచుకొని దొంగతనాలకు పాల్పడడం ప్రారంభించాడు.
అయితే విశ్వసనీ సమాచారంతో సౌత్జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, చాంద్రాయణగుట్ట పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి 36.5 తులాల బంగారం, కేజీ వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో టాస్క్ఫోర్స్ అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మి తదితరులు పాల్గొన్నారు.