నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ) : నకిరేకల్ మున్సిపాలిటీ అభివృద్ధి ప్రణాళికను రూపొందించాం. ఇప్పటికే పనులు కొనసాగుతున్నాయి. రూ.10 కోట్ల నిధులతో డ్రైనేజీ వ్యవస్థతో పాటు సీసీ రోడ్ల నిర్మాణం, రూ.12 కోట్లతో పట్టణంలోని ప్రధాన రహదారుల్లో సెంట్రల్ లైటింగ్ సిస్టంతోపాటు పచ్చని గ్రీనరీతో కూడిన డివైడర్ల ఏర్పాటుకు త్వరలో శ్రీకారం చుట్టనున్నాం. మిషన్ భగీరథ ద్వారా రానున్న రెండు నెలల్లో ఇంటింటికి నల్లా కనెక్షన్లను పూర్తి చేస్తాం. వీటితో పాటు విద్య, వైద్యం, రవాణా సౌకర్యాల పెంపుపైన దృష్టి పెడతాం. కొత్తగా ఏర్పడినా సరే మరో రెండుమూడేళ్లల్లో ఇతర మున్సిపాలిటీలకు ధీటుగా నకిరేకల్ను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుకే ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి నకిరేకల్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి” అని స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టీఆర్ఎస్ గెలుపుతోనే నకిరేకల్ అభివృద్ధి సాధ్యమంటున్న చిరుమర్తి లింగయ్యతో ప్రత్యేక ఇంటర్వ్యూ.
నమస్తే : కొత్తగా ఏర్పాటైన నకిరేకల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో తాజా పరిస్థితి ఏంటి?
చిరుమర్తి : నకిరేకల్ తొలిసారిగా మున్సిపాలిటీగా ఏర్పడింది. ఏర్పడిన వెంటనే వచ్చిన తొలి ఎన్నికలు ఇవి. ఈ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతోనే నకిరేకల్ అభివృద్ధి ముడిపడి ఉందనడంలో సందేహం లేదు. రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలువుతున్నాయి. ఇవన్నీ మరింత సమర్ధవంతంగా నకిరేకల్ ప్రజలకు అందాలంటే ఇక్కడ టీఆర్ఎస్ పాలకవర్గం ఏర్పడాల్సిందే. ప్రస్తుతం ఇక్కడ టీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా ఉంది. మున్సిపాలిటీలో 20కి 20వార్డుల్లో పోటీచేస్తున్న ఏకైక పార్టీ టీఆర్ఎస్నే. టీఆర్ఎస్ను ఎదుర్కొనేందుకు విపక్షాలన్నీ లోపాయికారిగా ఒక్కటయ్యాయి. అంటే నకిరేకల్ అభివృద్ధి ఇష్టం లేని వీరంతా టీఆర్ఎస్ గెలుపును ఎలాగైనా అడ్డుకోవాలని కుట్ర చేస్తున్నారు. అయినా సరే ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో ఎక్కడికెళ్ళినా ప్రజలు టీఆర్ఎస్ అభ్యర్థులకు బ్రహ్మరథం పడుతున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్తోనే నకిరేకల్లోనూ అభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారు. ఏకపక్ష విజయాన్ని కట్టబెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
నమస్తే : నకిరేకల్ అభివృద్ధిపై మీ వద్ద ఉన్న ప్రణాళిక ఏమిటి?
చిరుమర్తి : నకిరేకల్ మున్సిపాలిటీ అభివృద్ధిపై వార్డుల వారీగా సమగ్రంగా ప్రణాళికను రూపొందించాం. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉన్న నకిరేకల్ను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యం. పట్టణంలోని ప్రధాన రహదారితోపాటు ఇతర రహదారులను అభివృద్ధి చేయాల్సి ఉంది. బస్టాండ్ను ఆధునీకరించి, బస్సులు వచ్చేలా చూడాలి. సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను పట్టణమంతా విస్తరించాలి. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటి నల్లా కనెక్షన్లు ఇవ్వాలి. వైద్యపరంగా ఆస్పత్రి స్థాయిని పెంచి, సేవలను మెరుగుపర్చాలి. విద్యాపరంగా డిగ్రీ కాలేజికి పక్కా భవనం అవసరం ఉంది. పార్కుల ఏర్పాటు, వాటిల్లో యువత కోసం ఒపెన్ జిమ్స్ నిర్మాణం జరుగాలి. శ్మశానవాటికల సమస్య తీవ్రంగా ఉంది. ఆయావర్గాల వారీగా కమ్యూనిటీ హాల్స్ కోసం డిమాండ్లు ఉన్నాయి. పారిశుధ్య నిర్వహణపై దృష్టి పెట్టాల్సి ఉంది.
నమస్తే : ఇప్పటికే నకిరేకల్లో అమలులో ఉన్న అభివృద్ధి పథకాలు ఎలా ఉన్నాయి?
చిరుమర్తి : పట్టణానికి ఓ రూపురేఖగా నిలిచే నల్లగొండ-సూర్యాపేట ప్రధాన రహదారిని సెంట్రల్ లైటింగ్తో పాటు పచ్చనిచెట్లతో కూడిన డివైడర్తో తీర్చిదిద్దుతాం. ఇందుకోసం ఇప్పటికే 12కోట్లు మంజూరయ్యాయి. మరో 12కోట్లతో పట్టణంలో నుంచి తిప్పర్తి, నోముల, తాటికల్, కడపర్తిలకు వెళ్లే ఇతర ప్రధాన రహదారులను అభివృద్ది చేస్తాం. ఇక ప్రధానమైన సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణంపైన దృష్టి పెట్టాం. ఇప్పటికే 10కోట్ల నిధులతో పనులు చేపట్టాం. మిగిలినవి పూర్తి చేస్తాం. శిథిలావస్థలో ఉన్న బస్టాండ్ను రూ.50 లక్షలతో ఆధునీకరించాం. త్వరలోనే అన్ని డిపోల బస్సులు వచ్చేలా చేసి అందుబాటులోకి తెస్తాం. ఆయా వర్గాల వారీగా ప్రజల కోసం స్మశానవాటికల నిర్మాణం చేయాల్సి ఉంది. ఇప్పటికే గజ్వేల్ తరహాలతో 80లక్షలతో ఆధునిక వైకుంఠదామాన్ని సిద్దం చేశాం. డిగ్రీ కాలేజీకి పక్కా భవనం కోసం 5కోట్లతో ప్రతిపాదనలు సిద్దం చేశాం. అదనపు కోర్సుల మంజూరు కోసం కృషి జరుగుతుంది. ప్రభుత్వ ఆస్పత్రిని 100 పడకలకు పెంచి ఆధునీకరించేందుకు కృషి మొదలైంది.
ఇవి కూడా చదవండి
ఈసీపై మద్రాస్ హైకోర్ట్ వ్యాఖ్యలను స్వాగతించిన దీదీ
ఆ 8 రాష్ట్రాల్లో లక్ష దాటిన యాక్టివ్ కేసులు: కేంద్రం