ఆమనగల్లు : నకిలీ భూ పత్రాలను సృష్టించి రైతులను మోసం చేసి బ్యాంకు రుణాలను పొందిన కేసులో శుక్రవారం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ ఉపేందర్ పేర్కొన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. తలకొండపల్లి మండలంలోని చంద్రదాన గ్రామానికి చెందిన బంగారిగల్ల శ్రీను కొంతకాలంగా రైతులకు రుణాలను ఇప్పిస్తా అంటూ భూమి పత్రాలను తీసుకుని వాటిని పోర్జరి చేసి తానే బ్యాంకు రుణాలు పొందుతున్నాడు. అదే గ్రామానికి చెందిన మాలే జంగయ్య అనే రైతుకు రుణం ఇప్పిస్తానని భూమి పత్రాలను తీసుకొని పోర్జరీ చేసి 2012లో డీసీసీబీ బ్యాంకులో రుణం పొందాడు.
బాధిత రైతుకు ఉన్న 1.9 ఎకరా భూమిని 7.10 ఎకరాలుగా పత్రాలను సృష్టించి రూ. 2.25లక్షల రుణం పొందాడు. అయితే కొంత కాలంగా బ్యాంకు రుణానికి సంబంధించిన వడ్డీని కట్టకపోవడంతో ఇటీవల బ్యాంకు సిబ్బంది బాధిత రైతుకు నోటీసును జారీ చేశారు. గడువులోగా బ్యాంకులో తీసుకున్న రుణం చెల్లించాలని లేని యేడల భూమిని జప్తూ చేస్తామని బ్యాంకు సిబ్బంది రైతు ఇంటికి వేళ్లి హెచ్చరించారు. అవక్కాయైన రైతు భూమికి సంబంధించిన ధ్రువపత్రాలు తన వద్దనే ఉన్నాయని తాను బ్యాంకులో రుణం పొందలేదన్నారు. తనకు ఉన్నది కేవలం 1.9ఎకరాలు మాత్రమేనని బ్యాంకు అధికారుల దృష్టికి తీసుకరావడంతో తన పేరమీద తప్పుడు ధ్రువపత్రాలతో గుర్తుతెలియని వ్యక్తులు రుణం పొందిన విషయం బయట పడింది. దీంతో మోసపోయానని గమనించిన బాధిత రైతు ఎస్సై ధర్మేశ్కు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకొన్న ఎస్సై బ్యాంకు రుణాలకు సంబంధించిన పూర్తి వివరాల పై దర్యాప్తు చేయగా అదే గ్రామానికి చెందిన బంగారిగల శ్రీను అక్రమాలకు పాల్పడుతున్నట్టుగా గుర్తించారు.
దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా పోర్జరి పత్రాలు సృష్టించి బ్యాంకు రుణం పొంది వ్యక్తిగత అవసరాలు తీసుకొన్నట్లు ఒప్పుకున్నాడు. దీంతో నిందితుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. తప్పుడు ధ్రువపత్రాలను సృష్టించి రుణాల మంజురూ విషయంలో అప్పటి బ్యాంకు మేనేజర్ దమయంతి పాత్ర ఉందని ప్రాథమికంగా గుర్తించామన్నారు. దర్యాప్తులో మరికొన్ని విషయాలను వెలుగులోకి వస్తాయన్నారు. త్వరలోనే పూర్తిస్థాయి విచారణ ప్రారంభిస్తామని కేసు విషయంలో ప్రతీభ కనబరిచిన ఎస్సై ధర్మేశ్ను, సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. బ్యాంకు రుణాల విషయంలో రైతులు మధ్యవర్తులను నమ్మిమోసపోవద్దని ఆయన సూచించారు.