కూరగాయల సాగుకుప్రభుత్వం అత్యంతప్రాధాన్యమిస్తున్నది
జిల్లా కేంద్రాలు, పట్టణాల సమీపంలో పంటలు పండించాలి
సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్పై రైతులకు అవగాహన పెంచాలి
శాసన మండలిలో ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి
మెదక్, మార్చి 20 : తెలంగాణ రాష్ట్రంలో కూరగాయల సాగుకు ప్రభు త్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని, కూరగాయల్లో నియంత్రిత సాగును ప్రోత్సహించాలని ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి అన్నారు. శనివారం శాసన మండలిలో కూరగాయల సాగుపై ఆయన మాట్లాడుతూ.. ఒక వ్యక్తికి సగటున ఏడాదికి 110 కిలోల కూరగాయలు అవసరం ఉంటే.. 90 కిలోలు మాత్రమే వినియోగిస్తున్నారని, దీని వల్ల శరీరం లో సమతుల్యత లోపించి అనారోగ్యంతో దవాఖానల్లో చేరుతున్నారని, మానసిక ఒత్తిడికి సైతం గురవుతున్నారన్నారు. ప్రభుత్వం సాగునీటి వసతి కల్పించినా హైదరాబాద్ చుట్టూ రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగిపోవడంతో జిల్లాల్లో వరి సాగుకు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. జిల్లా కేంద్రా లు, పట్టణాల సమీపంలో కూరగాయల సాగును ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి దృష్టికి ఆయన తీసుకెళ్లారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను రాష్ట్రంలో విస్తరింపజేసి రైతులకు అవగాహన కల్పించాలని ఆయన కోరారు.
స్పందించిన మంత్రి నిరంజన్రెడ్డి..
దేశంలో ఏటా 2.54 కోట్ల ఎకరాల్లో కూరగాయల పంట సాగు చేస్తున్నారని, ప్రపంచంలో కూరగాయల ఉత్పత్తిలో 11.2 శాతంతో దేశం 2వ స్థానంలో ఉందని మంత్రి నిరంజన్రెడ్డి సమాధానమిచ్చారు. తెలంగాణలో 2.73 లక్షల ఎకరాల్లో కూరగాయల సాగు చేస్తుండగా, 24.99 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందన్నారు. సీజన్లో టమాట 32, మిర్చి 10, బెండ 7.4, వంకాయ 7.3 శాతం తెలంగాణ నుంచి ఉత్పత్తి అవుతున్నాయని తెలిపారు. ఈ బడ్జెట్లో ప్రగతి పద్దు కింద ఉద్యాన శాఖకు రూ.242 కోట్లు, కూరగాయల పంటలను ప్రోత్సహించేందుకు రూ.50 కోట్లు కేటాయించామని తెలిపారు. డిమాండ్కు తగ్గట్టుగానే తెలంగాణలో కూరగాయల ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు.