సిమ్లా: హిమాచల్ప్రదేశ్ రాష్ట్రంలోని చంబా జిల్లాలో దారుణం జరిగింది. ఇంట్లో మంటలు చెలరేగి ( Fire accident ) ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ప్రమాదంలో తండ్రి, ముగ్గురు పిల్లలు ప్రాణాలు కోల్పోగా.. తీవ్రంగా గాయపడ్డ తల్లి ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. వివరాల్లోకి వెళ్తే.. చంబా జిల్లాలోని కరతోష్ గ్రామంలో రఫీ మహమ్మద్ అనే వ్యక్తి భార్య ముగ్గురు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు.
ఈ క్రమంలో మంగళవారం ఉదయం వారింట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఆరిఫ్ మహమ్మద్ (25), అతని ఇద్దరు కుమార్తెలు జైతున్ (6), జుల్ఖా (02), కుమారుడు సమీర్ (4) సజీవ దహనమయ్యారు. ఆ మంటల్లో తీవ్రగాయపడ్డ ఆరిఫ్ భార్య ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని చెప్పారు.