న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజువారీ కరోనా కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. గత నాలుగు రోజుల్లో దాదాపు లక్షన్నర వరకు పాజిటివ్ కేసులు నమోదవగా.. యాక్టివ్ కేసుల సంఖ్య 3లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో 43,846 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వశాఖ ఆదివారం తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,15,99,130కు పెరిగింది. కొత్తగా 22,956 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 1,11,30,288 మంది డిశ్చార్జి అయ్యారు. వైరస్ ప్రభావంతో మరో 197 మంది మృత్యువాతపడగా.. మొత్తం మరణాల సంఖ్య 1,59,755కు చేరింది. ప్రస్తుతం దేశంలో 3,09,087 యాక్టివ్ కేసులున్నాయని చెప్పింది. మరో వైపు టీకా డ్రైవ్ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటి వరకు 4,46,03,841 మందికి వ్యాక్సిన్ డోసులు వేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వివరించింది. మరో వైపు దేశంలో పరీక్షలు సైతం భారీగానే సాగుతున్నాయి. ఇప్పటికే 23.35 కోట్లకుపైగా పరీక్షలు చేశారు. శనివారం దేశవ్యాప్తంగా ఒకే రోజు 11,33,602 కొవిడ్ శాంపిల్స్ పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. ఇప్పటి వరకు 23,35,65,119 నమూనాలను పరిశీలించినట్లు వివరించింది.