బాధితులు కోలుకుంటున్నారు..
ప్రైవేటు ఆసుపత్రుల నుంచి వచ్చినవారే ఇబ్బంది పడుతున్నారు
24 గంటలు వైద్యసేవలు
భయపడకుండా చికిత్సకు సహకరించాలి
భద్రాద్రి జిల్లా ఆసుపత్రి ఆర్ఎంవో డాక్టర్ రవిబాబు
కొత్తగూడెం మే 11 : కరోనా మహమ్మారి నుంచి బాధితులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని కొత్తగూడెం జిల్లా ఆసుపత్రి ఆర్ఎంవో డాక్టర్ రవిబాబు పేర్కొన్నారు. ఆయన కొవిడ్పై మంగళవారం పలు సందేహాలు, అనుమానాలను నివృత్తి చేశారు. ప్రజలు భయపడకుండా ఉంటే వైద్యం చేయడం సులువు అవుతుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్స్, ఆక్సీజన్ కొరత లేదని స్పష్టం చేశారు. బయట జరిగే తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దు అని చెప్పారు. పాజిటివ్ రాగానే చాలా మంది ఖరీదైన వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారని, దీని ద్వారా ఇబ్బంది పడుతున్నారని, అత్యవసర పరిస్థితుల్లో రోగులకు వైద్యం అందక మృతిచెందుతున్నారని అన్నారు.
నమస్తే : వైరస్ ప్రభావం వల్ల ఇబ్బందులు ఉన్నాయా?
ఆర్ఎంఓ : వైరస్ ప్రభావం వల్ల ఇబ్బందులు ఉన్నమాట నిజమే. కాని భయంతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ధైర్యంగా ఉంటే త్వరగా రికవరీ అవుతారు. నిర్లక్ష్యం వల్ల కొంత మంది ఆసుపత్రిలో ఆలస్యంగా అడ్మిట్ అవుతున్నారు. దీనివల్ల సమస్యలు ఉత్పన్నమతున్నాయి. రోగులకు ఎలాంటి భయం లేదు. ఏ సమయంలోనైనా వైద్యం అందిస్తాం.
నమస్తే : పడకలు, ఆక్సీజన్ కొరత ఉందంటున్నారు.? ఇది ఎంత వరకు కరెక్టు?
ఆర్ఎంఓ : ఎక్కువ పడకలున్నవి మన దగ్గరే. జిల్లా ఆసుపత్రిలో డీసీహెచ్ఎస్ పర్యవేక్షణ చేస్తున్నారు. ఇప్పటి వరకు 260 బెడ్స్ ఉన్నాయి. వాటిలో 180 మంది మాత్రమే ఉన్నారు. ఇవి కాక మరో 100 పడకలు సిద్ధంగా ఉంచాం. ఇందులో 110 ఆక్సీజన్ బెడ్స్ ఉన్నాయి. ఆక్సీజన్ కొరత లేదు. 6000 లీటర్ల ఆక్సీజన్ ఉంది. 80 సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి.
నమస్తే : గతంలో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం లేక ప్రైవేటును ఆశ్రయించేవారు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు?
ఆర్ఎంఓ : తెలంగాణ ప్రభుత్వం వచ్చాక వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రైవేటుకు దీటుగా సేవలు అందుతున్నాయి. ముందు భయపడి అక్కడికి వెళ్తున్నారు. చివరికి వాళ్లు చేతులు ఎత్తేసి రెమిడిసివర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉందని పంపిస్తున్నారు. అలాంటి వారు ఆక్సీజన్ లెవెల్స్ తగ్గాక ఇక్కడకు వస్తున్నారు. అందుకే మరణాలు సంభవిస్తున్నాయి.
నమస్తే : టెస్టులు చేయడం లేదని అంటున్నారు?
ఆర్ఎంఓ : ఆసుపత్రికి వచ్చిన ప్రతి ఒక్కరికి పరీక్షలు చేస్తున్నాం. రోజూ పెద్ద క్యూ ఉంటుంది. వారి కోసం టెంట్ కూడా ఏర్పాటు చేశాం. 300 నుంచి 400 వరకు పరీక్షలు చేస్తున్నాం. అవసరం అయినవారికి ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తున్నాం. పాజిటివ్ వచ్చినవారికి హోంఐసోలేషన్ కిట్లు ఇచ్చి పంపిస్తున్నాం. రోజుకు 150 కిట్స్ ఇవ్వడం జరుగుతున్నది.
నమస్తే : రోజుకు ఎంత మంది అడ్మిట్ అవుతున్నారు ?
ఆర్ఎంఓ : ప్రతి రోజు 40 మందిపైనే అడ్మిట్ అవుతున్నారు. అదే క్రమంలో 40 మంది వైద్యం తీసుకుని డిశ్చార్జి అవుతున్నారు. ఇక్కడ అడ్మిట్ అయినవారు చాలా త్వరగా కోలుకుని ఇంటికి వెళ్తున్నారు. వారికి మంచి వైద్యం అందిస్తున్నాం. నలుగురు వైద్యులు పర్యవేక్షణ చేస్తున్నారు. బాధితులకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం పెడుతున్నాం.
నమస్తే : ఆసుపత్రి పర్యవేక్షణ ఎవరు చూస్తున్నారు?
ఆర్ఎంఓ : కలెక్టర్ ఎంవీ రెడ్డి నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ప్రతి రోజు వీసీ, టీసీ ద్వారా అన్ని సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ఆక్సీజన్, పడకల విషయంలో కేర్ తీసుకున్నారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం. శానిటేషన్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మాలో చాలా మందికి పాజిటివ్ వస్తుంది.. పోతుంది. రికవరీ అవగానే మళ్లీ విధుల్లోకి వచ్చి సేవలు అందిస్తున్నాం.