ఎల్లారెడ్డి రూరల్/తాడ్వాయి, నవంబర్ 3: దీపావళి వెలుగుల్లో పండుగ చేసుకోవాలనుకున్న ఓ కుటుంబం చిన్నాభిన్నమైంది. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రాపహాడ్ శివారులో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు. ఎల్లారెడ్డికి చెందిన వీరపేట శ్రీనివాస్ (52), వీరపేట జగన్ (45), పిట్లంకు చెందిన నాజోజు ఆనంద్కుమార్ (31), నాజోజు సుశాంక్ (4) మృతిచెందగా.. యశ్వంత్, శ్రీహర్ష, మందహాస్ తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. ఎల్లారెడ్డికి చెందిన శ్రీనివాస్ పిట్లంలో ఉండే తన కుమార్తె సుప్రియ, అల్లుడు ఆనంద్కుమార్ను దీపావళి పండుగకు ఆహ్వానించాడు. ఎల్లారెడ్డికి కుటుంబంతో వచ్చిన ఆనంద్కుమార్ పండుగ షాపింగ్ కోసం బుధవారం ఉదయం కామారెడ్డికి వెళ్లారు. ఆనంద్కుమార్తోపాటు మామ శ్రీనివాస్, ఆయన తమ్ముళ్లు జగన్, మందహాస్, బావమరిది అమర్కాంత్, కుమారుడు సుశాంక్, యశ్వంత్, శ్రీహర్ష వెళ్లారు. షాపింగ్ ముగించుకొని ఎల్లారెడ్డికి వస్తుండగా తాడ్వాయి దాటగానే వర్షం మొదలైంది. కారు ఎర్రాపహాడ్ శివారుకు చేరుకోగానే అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ముందు సీట్లో ఉన్న జగన్ అక్కడికక్కడే మృతిచెందగా, డ్రైవింగ్ చేస్తున్న ఆనంద్కుమార్, వెనుక కూర్చు న్న శ్రీనివాస్, సుశాంక్కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆనంద్కుమార్ను రక్షించేందుకు ప్రయత్నిస్తుండగా చనిపోయాడు. దవాఖానకు తరలిస్తుండగా శ్రీనివాస్ మృతిచెందగా, కామారెడ్డి హాస్పిటల్లో చేర్పించిన కొద్దిసేపటికే సుశాంక్ కూడా చనిపోయాడు. మిగతావారికి తీవ్రగాయాలు అయ్యాయి. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందడంతో ఎల్లారెడ్డి, పిట్లంలో విషాదఛాయలు అలుముకున్నాయి.