హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): కరోనా రోగులను గుర్తించేందుకు ఇంటింటికి వెళ్లి జ్వర సర్వే నిర్వహిస్తున్న రాష్ట్రప్రభుత్వం లక్షణాలుంటే ఆక్సిజన్ స్థాయులను కూడా పరీక్షించాలని నిర్ణయించింది. స్వల్ప లక్షణాలుంటే ఇంట్లోనే చికిత్స తీసుకొనేవాళ్లకు మెడికల్ కిట్ అందజేస్తూనే, ఆక్సిజన్ శాతాన్ని నమోదు చేయనున్నారు. శరీర ఉష్ణోగ్రత, పల్స్ను కూడా నోట్ చేయనున్నారు. ఆక్సిజన్ శాతం నిర్దేశించిన దానికంటే తక్కువగా ఉంటే వారిని సమీప ప్రభుత్వ దవాఖానలకు తరలించి వైద్యం అందించనున్నారు. దీనికోసం మరిన్ని ఆక్సిమీటర్లను పీహెచ్సీలకు పంపించేందుకు నిర్ణయించినట్టు సమాచారం.